తెలంగాణ సిఎం కేసీఆర్ కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతానంటూ బిఆర్ఎస్ ఫిరంగిని సిద్దం చేసుకొంటున్నారు. ఆయన తమ అధినేతని, పార్టీని దెబ్బ తీయాలని చూస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ బిజెపికి కూడా ఆయన శత్రువే. అందుకే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అప్పుడే కేసీఆర్పై తుపాకీ ఎక్కుపెట్టారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రులను ఎంతగానో అవమానించిన కేసీఆర్, ఏపీలో అడుగుపెట్టే ముందు ముక్కు నేలకు రాసి ఏపీ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. కనుక మున్ముందు ఇటువంటి మరిన్ని తూటాలను వారు కేసీఆర్ మీద ప్రయోగించడం ఖాయం.
అయితే వారు ఎన్ని తూటాలు పేల్చినా దాని వలన బిజెపికి కొత్తగా ఒరిగెదేమీ ఉండకపోగా ఆ ప్రయోజనం టిడిపి, వైసీపీలకే దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, బిఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టినా పెట్టకపోయినా ఏపీలో బిజెపి అధికారంలోకి రాలేదు. కనుక అది కేసీఆర్తో చేసే యుద్ధంతో ప్రజలలో ఆంధ్రా సెంటిమెంట్ రగిలితే వారు టిడిపి, వైసీపీలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ బిఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టాక దాంతో వైసీపీ పొత్తులు పెట్టుకోవడానికి సిద్దపడితే వాటి ఉమ్మడి టార్గెట్ టిడిపి, బిజెపి, జనసేనలు అవుతాయి. ఒకవేళ వాటి మద్య పొత్తులు కుదరకపోతే బిఆర్ఎస్ మొట్ట మొదటి టార్గెట్ వైసీపీ, ఆ తర్వాత బిజెపి, టిడిపి, జనసేనలు అవుతాయి.
ఏది ఏమైనప్పటికీ బిఆర్ఎస్ ఎంట్రీతో ఏపీ బిజెపి మరింత నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఏవిదంగా అంటే, కేసీఆర్ ఏపీలో అడుగుపెడితే మొట్ట మొదట రాష్ట్ర విభజన వివాదాలపై ఏపీ ప్రజలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. కనుక అప్పుడు ఆయన ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వంపైకి నెట్టేసి ‘అన్నదమ్ములలా మెలగవలసిన రెండు తెలుగు రాష్ట్రాలు గొడవలు కేంద్రం వలననే గొడవపడాల్సి వస్తోందంటూ ఆరోపించడం ఖాయం.
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఏపీ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు కనుక కేసీఆర్ చేయబోయే ఇటువంటి వాదనలతో లోక్సభ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయం. కనుక బిజెపి నేతలు కేసీఆర్పై విమర్శలు చేస్తూ అప్రయత్నంగా టిడిపి, వైసీపీలకు సాయపడుతూనే, బిఆర్ఎస్ రాకతో నష్టపోనున్నారు. రాబోయే రోజుల్లో ఇది అందరూ కళ్ళారా చూడవచ్చు.



