ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు చేదు అనుభవం ఎదురైంది. హూస్టన్ లో ‘ఎస్పీబీ 50’ టూర్ లో ఉండగా ఆయన బ్యాగ్ ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారని బాలసుబ్రహ్మణ్యం తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. దుండగులు ఎత్తుకెళ్లిన తన బ్యాగ్ లో పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు, కొంత నగదు సహా పాటల స్క్రిప్టులూ ఉన్నాయన్నారు.
హూస్టన్ లో ని భారత రాయబార కార్యాలయం అధికారుల సాయంతో డూప్లికేట్ పాస్ పోర్టును పొందానని, తనకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు. అయితే తన బ్యాగ్ చోరీకి గురైందనే సమాచారం తెలుసుకున్న తన అభిమానులు చాలా మంది ఆందోళన చెందుతున్నారని, తనకేమీ ఇబ్బంది లేదని, బాగానే ఉన్నానని అన్నారు. ‘యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అండ్ హీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్.. గాడ్ బ్లెస్ యూ ఆల్’ అని ఎస్పీ తన పోస్ట్ లో పేర్కొన్నారు.



