రాజధాని తరలింపుని సమర్ధించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పే కారణాలు విచిత్రంగా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారాం తన స్థాయిని కూడా మర్చిపోయి ప్రభుత్వానికి బాకా ఊదే పనిలో పడటం మరింత విశేషం. విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రతిపాదించిన నాటి నుండీ అది మరింత ఎక్కువైంది.
‘‘సామాన్యుడికి రాజధానులతో పనిలేదు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సీఎం జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారు. దీనిపై రాద్ధాంతం చేయడం తగదు. విశాఖలో రాజధాని ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తే ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వం’’ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న నేత ప్రతిపక్ష నేతను ఉత్తరాంధ్రలో అడుగుపెట్టనివ్వడం అని చెప్పడం ఏంటో? సామాన్యుడికి రాజధానులతో పనిలేదు అంటే అర్ధం ఏంటి? అసలు రాజధాని తరలింపు అనేది పరిపాలనా వికేంద్రీకరణ కోసమే కదా? పరిపాలన, రాజధాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు అంటే ఇంకా రాజధాని తరలించి ఏం ఉపయోగం?
మరో వైపు ఇంకొందరు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లా కాకూడదనే అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నాం అంటారు. కొందరేమో విశాఖపట్నంకు రాజధాని మారిస్తే హైదరాబాద్ స్థాయి రాజధానిని నిర్మించడం తేలిక అవుతుందని, ఖర్చు కూడా తగ్గుతుందని అంటారు. అయితే రెండు వాదనలకు పొంతన లేకపోవడం విశేషం.



