కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు, వారి సొంత మీడియా నిత్యం దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు.
ఉదాహరణకు రాష్ట్రంలో మహిళలు స్త్రీశక్తి పదకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం వినియోగించుకుంటూనే ఉన్నారు. కానీ స్త్రీశక్తి పధకం పేరుతో సిఎం చంద్రబాబు నాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైసీపీ దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
వైసీపీ దుష్ప్రచారం పతాకస్థాయికి చేరుకోవడంతో కూటమి ప్రభుత్వం దానికి గట్టిగా జవాబు ఈయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే నేడు అనంతపురంలో కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు కలిసి ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశాయి.
ఈ సభ వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి మాత్రమే కాదు… సిఎం చంద్రబాబు నాయుడు మారిన రాజకీయ వైఖరికి కూడా నిదర్శనంగా చూడవచ్చు.
ఇదివరకు తాను పాలన, అభివృద్ధి మీదే ఎక్కువ దృష్టి పెట్టి చేసిన మంచి పనులు, సంక్షేమ పధకాల గురించి ప్రజలకు చెప్పుకోకపోవడం వలన నష్టపోయామని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా చాలాసార్లు చెప్పారు. కనుక ఈసారి పాలనతో పాటు రాజకీయంగా కూడా బలమైన వ్యూహాలతో ముందుకు సాగుతానని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చెప్పారు.
ఆ ప్రకారమే సిఎం చంద్రబాబు నాయుడు రూటు మార్చి తరచూ ప్రజల మధ్యకు వెళ్ళి వారితో ముఖాముఖి మాట్లాడుతూ ప్రజా సంబంధాలు బలపరుచుకున్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ సంక్షేమ పధకాలు అమలుచేస్తోంది. కానీ వాటిని ముఖ్యమంత్రి స్వయంగా లబ్దిదారులకు అందిస్తున్నప్పుడు ఆ ప్రభావం ప్రజలపై చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజలు కూడా భావిస్తారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీల నేతలు ఒకే వేదికపై కనిపిస్తున్నారు.
కనుక జగన్మోహన్ రెడ్డి టీడీపికి జనసేనకి, టీడీపికి బీజేపికి మద్య చిచ్చుపెట్టేందుకు కుట్రలు చేస్తూనే ఉన్నారు. కనుక మూడు పార్టీల మద్య ఐఖ్యత ఉందని ప్రజలకు, ముఖ్యంగా… జగన్కి, వైసీపీ నేతలకు అర్ధమయ్యేలా చెప్పడం కూడా చాలా అవసరం.
కనుక నేడు అనంతపురంలో జరుగుతున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభ వ్యూహాత్మకమైనదే అని భావించవచ్చు.






