అవినాష్ రెడ్డి కేసు వాయిదా అంటే బెయిల్‌ ఇచ్చిన్నట్లే కదా?

Supreme-Court-Avinash-Reddyవివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ కొంత గడువు కావాలని కోరడంతో సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ రెండో వారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిపినప్పుడే అవినాష్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌తో పాటు గంగిరెడ్డికి బెయిల్‌ పిటిషన్‌పై కూడా వాదనలు వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.

ఇదివరకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా తప్పించుకొంటునప్పుడు 3-4 రోజులు మహా అయితే వారం రోజులు గడువు పొందుతుండేవారు. కానీ ఈ కేసు సుప్రీంకోర్టు వెళ్ళినప్పటి నుంచి ఏకంగా రెండేసి నెలలు గడువు పొందుతున్నారు. అంటే ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అర్దమవుతోంది.

ADVERTISEMENT

సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ జరపడం అంటే అంతవరకు ఆయన అడగకుండానే సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన్నట్లే కదా?ఈ కేసు విచారణను జూన్ నెలాఖరులోగా పూర్తిచేయాలంటూ సీబీఐ మీద చిందులు వేసిన సుప్రీంకోర్టే ఇప్పుడు మరో రెండు నెలలు ఈ కేసును పొడిగించడం విశేషం.

నేడు ఈ కేసు విచారణ జరుగుతుందని ఇదివరకు వాయిదాలోనే సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇంత గడువు లభించినా సీబీఐ కౌంటర్ సిద్దం చేసుకోకుండా వచ్చి మరికొంత గడువు కావాలని కోరడం అనుమానం కలిగిస్తుంది. తద్వారా అదే అవినాష్ రెడ్డికి పరోక్షంగా సహకరిస్తోందనే ప్రతిపక్షాల వాదనలు ధృవీకరించినట్లయింది కదా?

ఈ లెక్కన వివేకా హంతకులను దోషులుగా నిర్దారించేది ఎప్పుడు?వారికి శిక్షలు పడేదెప్పుడు?

ఈ కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయినప్పటికీ ముందుకు సాగకపోవడం గమనిస్తే, సునీతా రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ కేసు ఇలాగే సాగుతుండటానికి న్యాయ ప్రక్రియలో జాప్యంగా పైకి కనిపిస్తున్నప్పటికీ అసలు కారణం అందరికీ తెలుసు. కనుక ఈ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా సునీతారెడ్డి న్యాయం కోసం కోర్టులు చుట్టూ తిరుగుతుండటం వృదా ప్రయాసే కావచ్చు.

ADVERTISEMENT
Latest Stories