అక్రమాస్తుల కేసులో తమిళనాడు ‘అమ్మ’ జయలలితతో సహా మిగిలిన ముగ్గురు కూడా దోషులేనని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చిన నేపధ్యంలో… ఇప్పటికే ‘కాలం’ చేసిన జయలలిత శిక్ష నుండి తప్పించుకున్నట్లే. శిక్షించే అవకాశం లేకపోయినా గానీ, జయలలితకు విధించిన పెనాల్టీ విషయం రాజీపడే ప్రశ్నే లేదని, ఆమెకు విధించిన జరిమానాను రికవరీ చేసుకునేందుకు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసులో జయలలితకు కూడా 100 కోట్ల జరిమానాను కర్ణాటక స్పెషల్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఆ జరిమానాను వసూలు చేసేందుకు జయలలితకు చెందిన ఆస్తులతో పాటు, సహ నిందితులు స్థాపించిన ఆరు కంపెనీల ఆస్తులనూ స్వాధీనం చేసుకోవాలని న్యాయమూర్తులు పినాకి చంద్రఘోష్, అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావాల్సిందేనని తెలిపింది. దీంతో ఇప్పటివరకు అమ్మ ఆస్తులు ఎవరికి దక్కుతాయోనని వేచిచూసిన వారికి సుప్రీం తీర్పు ద్వారా సమాధానం లభించినట్లయ్యింది.



