తన పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేలపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని అనేక రకాలుగా ప్రయత్నాలు గావిస్తున్న వైసీపీ అధినేత జగన్ కు ప్రతి సందర్భంలోనూ చుక్కెదురవుతోంది. దీనిపై ఇటీవలే స్పీకర్ ఫిర్యాదు చేసి చట్ట ప్రకారం వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరగా, తనకు అందిలో వాటిలో సాంకేతిక తప్పులు ఉన్నాయంటూ స్పీకర్ మళ్ళీ వాటిని వైసీపీకే తిప్పికొట్టిన విషయం తెలిసిందే.
అయితే ఇదే అంశంలో ఏకంగా సుప్రీంకోర్టు గడప కూడా తొక్కింది వైసీపీ. అయితే తాజాగా ఆ ఆశ కూడా జగన్ కు వీగిపోయినట్లయ్యింది. వైకాపా ఇచ్చిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ… ఈ కేసులోని విషయాలు స్పీకర్ పరిధిలో ఉంటాయని, తొలుత హైకోర్టుకు వెళ్ళాలని సూచనలు చేసింది. కేసు విచారణను హైకోర్టు త్వరగానే పూర్తి చేస్తుందన్న నమ్మకంతో హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు కూడా జారీ చేయడం లేదంటూ పేర్కొంది.
దీంతో బాల్ హైకోర్టులో పడినట్లయ్యింది. మరి హైకోర్టుకు వైసీపీ వెళ్తుందో లేదో గానీ, వైఎస్ జయంతి నాడు అత్యంత నిరుత్సాహకరమైన వాతావరణం వైసీపీ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ హైకోర్టుకు వెళ్ళినా, పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చని, అక్కడ కూడా ఇదే రకమైన (స్పీకర్ పరిధిలో) అంశంగా కొట్టిపడేయవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా సర్దుమనిగినట్లు కనిపించిన జంపింగ్ ల వ్యవహారం సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ పురుడు పోసుకుంటుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



