శనివారం ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 10వ సదస్సులో పార్టీలకు అతీతంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ తమ రాష్ట్రాల సమస్యలు, తమ అభిప్రాయాలు చెప్పారు. వారిలో తమిళనాడు సిఎం స్టాలిన్ కూడా ఒకరు.
ఈ సమావేశంలో ఆయన పన్నులలో రాష్ట్రాల వాటాల చెల్లింపుపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులలో రాష్ట్రాలకు 41 శాతం వాటా తిరిగి చెల్లిస్తామని చెప్పింది. కానీ ఆ మాట నిలబెట్టుకోకపోగా ఏటా ఆ వాటాలలో కోత విధిస్తోందని స్టాలిన్ విమర్శించారు.
రాష్ట్రాలకు 41 శాతం ఇస్తున్నామని చెప్పుకుంటూ కేవలం 33.16 శాతం మాత్రమే ఇస్తోందని, ఇది చాలా అన్యాయం, అక్రమమని స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల రూపేణా వస్తున్న ఆదాయంలో అధిక భాగం కేంద్రమే ఉంచేసుకుంటే, మిగిలిన కొద్దిపాటి నిధులతో రాష్ట్రాలు ఏవిదంగా మనుగడ సాగించగలవని స్టాలిన్ ప్రశ్నించారు. కనుక రాష్ట్రాలకు 33.16 లేదా 41 శాతం కాదు.. 50 శాతం వాటా తప్పనిసరిగా ఇవ్వాలని తమిళనాడు సిఎం స్టాలిన్ ప్రధాని మోడీని కోరారు.
ఒకప్పుడు ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 15 ఏళ్ళ పాటు పనిచేశారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఈవిదంగానే వ్యవహరిస్తే రాష్ట్రాలు ఎంతగా ఇబ్బంది పడతాయో అర్ధమైందని అందుకే తాను ప్రధాని కాగానే పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వాలని నిర్ణయించామని మోడీ స్వయంగా చెప్పుకున్నారు.
కానీ ఇప్పుడు ఆయన కూడా యూపీఏ ప్రభుత్వంలాగే వ్యవహరిస్తున్నారని తమిళనాడు సిఎం స్టాలిన్ విమర్శిస్తున్నారు. మరి ఆయన విమర్శలు, 50 శాతం వాటా డిమాండ్పై ప్రధాని మోడీ ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.




