తానూ జైలుకు వెళ్ళినా, తను నిర్ణయించిన వ్యక్తినే ముఖ్యమంత్రిని చేసుకోవడం సక్సెస్ సాధించిన శశికళ, అసలు ‘గేమ్’ మొదలుపెట్టినట్లుగా కనపడుతోంది. కోర్టు విధించిన శిక్షను అమలు చేసే భాగంగా పోలీసులు బెంగుళూరులోని పరప్పణ జైలుకు తరలించగా, ఇక అక్కడ నుండి బయటపడి చెన్నై జైలులో ఈ శిక్షను అనుభవించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓ పక్కన పళనిస్వామి నేతృత్వంలోని తమిళనాడు సర్కార్ కూడా ఇందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందన్న విషయం, పళని సిఎం అయిన కాసేపటికే ప్రకటించారు.
అయితే తాజాగా శశికళ పరప్పణ అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాసారు శశికళ. “ఈ జైలులో తనకు ప్రాణహాని ఉందని, తనను చెన్నై జైలుకు పంపించాలన్నది” సదరు లేఖ సారాంశం. శశికళ రాసిన ఈ వినతి పత్రాన్ని పరిశీలిస్తామని జైలు అధికారులు చెప్పడం అనేది ‘కాగల కార్యం గంధర్వులు నేరవేర్చడమనే దానికి సంకేతాలా?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రాణహాని ఉందని చెప్పడం శశికళ హక్కుగా భావించినా, జైలులో ఉండగా తనకు ఎవరి నుండి ప్రాణహాని ఉందనే విషయం చెప్పకపోవడం గమనించదగ్గ విషయమే.
చూడబోతుంటే… బెంగుళూరు నుండి చెన్నైకు తరలించడానికి తగు విధంగా బ్యాక్ గ్రౌండ్ ను సెట్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. మూడున్నర్రేళ్ళ పాటు ఒక సాధారణ ఖైదీగా శశికళ జైలు జీవితం అనుభవించడం అంటే సాధారణ విషయం కాదు. అదే సొంత రాష్ట్రం చెన్నైలో ఉంటే ఆ తీరే వేరు కదా! దీంతో అసలు ‘గేమ్’ను శశికళ మొదలుపెట్టినట్లుగా కనపడుతోంది. బహుశా మరికొద్ది రోజుల్లోనే జైలు మార్పిడి జరగవచ్చని తమిళనాట బలంగా ప్రచారం జరుగుతోంది.



