తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు లారీ కంటైనర్లలో పట్టుబడ్డ 570 కోట్ల కేసు కీలక మలుపు తిరిగింది. సరిగ్గా ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో ఈ ఉదంతం దేశవ్యాప్తంగా పెను కలకలమే రేపింది. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మద్రాస్ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దర్యాప్తులో భాగంగా సీబీఐకు ఓ కీలక ఆధారం లభించిందని సమాచారం.
కోయంబత్తూరులోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖ నుంచి విశాఖలోని అదే బ్యాంకు శాఖకు ఈ నగదును తరలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే మూడు కంటెయినర్లలో తరలిస్తున్న ఈ నగదుకు భద్రతగా ఏ ఒక్క సాయుధ పోలీసు లేని వైనంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు ఈ నగదును తరలిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఈ ఆరోపణలను నిజం చేస్తున్నట్లుగా తాజాగా సీబీఐకు లభించిన ఆధారం చెప్తోంది.
నగదును తరలిస్తూ పట్టబుడ్డ మూడు కంటెయినర్లకు వాటి అసలు నెంబర్లు కాకుండా ఏపీకి చెందిన మూడు బైక్ ల నెంబర్ ప్లేట్లను తగిలించడం… ఈ కధలో అసలు ‘ట్విస్ట్’కు దారి తీసింది. కంటెయినర్లపై ఉన్న నెంబర్లు ఏపీ 13ఎక్స్5204, ఏపీ 13ఎక్స్8650, ఏపీ 5203 13ఎక్స్… ఏపీకి చెందిన మూడు బైక్ లకు సంబంధించినవని సీబీఐ నిర్ధారించింది. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



