2017 కర్నూల్ లోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ‘సుగాలి ప్రీతి’ అనే విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితులలో వికటజీవిగా కనిపించింది. దీనితో అప్పుడు నమోదయిఅన్ ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యింది.
అయితే తమ బిడ్డ మృతి పై తనకు అనుమానాలున్నాయని, తన బిడ్డ మరణం వెనుక స్కూల్ కరస్పాండెంట్ కుమారుల పాత్ర ఉందంటూ, ఇది ఆత్మహత్య కాదు హత్య అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు. తన బిడ్డను ఆత్యాచారం చేసి అత్యంత పాశవికంగా హతమార్చారంటూ రోదించిన సుగాలి తల్లితండ్రులు తమ బిడ్డ చావుకి న్యాయం జరిగేలా నిందితులకు కఠిన శిక్ష వేయాలంటూ గత ప్రభుత్వాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన ఫలితం లేకపోయింది.
అయితే ఈ కేసు విషయంలో తమకు న్యాయం జరిగేలా చుడాలంటూ సుగాలి తల్లితండ్రులు జనసేన పవన్ కళ్యాణ్ వద్దకు రావడం, ఆ పై పవన్ ఈ కేసు పై ప్రత్యేక శ్రద్ద చూపడంతో సుగాలి ప్రీతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే పవన్ గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తన చేతికి అధికారం వస్తే, తమ పార్టీకి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానంటూ హామీ ఇచ్చారు.
పవన్ ఇచ్చిన హామీ అమలు చేసే దిశగా 2024 లో జనసేన ప్రభుత్వంలో భాగమయ్యింది, పవన్ చేతికి ఉప ముఖ్యమంత్రి అనే అధికారం దక్కింది. దీనితో సుగాలి ప్రీతికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఊహించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మింగుడు పడడం లేదనే చెప్పాలి. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు చేయడం తమ వల్ల కాదంటూ సీబీఐ పక్కకు తప్పుకోవడంతో ఒక్కసారిగా అందరికి పవన్ టార్గెట్ అయ్యారు.
ఈ నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించిన సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందిస్తూ 2017 లో చనిపోయిన సుగాలి ప్రీతి కి అనాయ్యం జరిగిందని, 2019, 2024 ఎన్నికలలో ప్రచారం చేసిన పవన్ తానూ అధికారంలోకి వస్తే బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. కాని అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయినా కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
అంతే కాకుండా ఇప్పుడా కేసు నుంచి సీబీఐ కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో పవన్ ఈ కేసు విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు.? అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో దాదాపు 30 వేలు పైచిలుకు మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారంటూ చేసిన ఆరోపణలకు గాను ఇప్పటి వరకు ఆ విషయమై విచారణ ఏ మేరకు నిర్వహించారు.? అంటూ తమ్మారెడ్డి భరద్వాజ్ పవన్ పై విమర్శనాత్మక ప్రశ్నలను సంధించారు.
సుగాలి కేసు విషయంలో పవన్ నిశ్శబ్దాన్ని ఒక్క తమ్మారెడ్డి మాత్రమే కాదు వైసీపీ శ్రేణులు కూడా ప్రశ్నిస్తున్నారు. పవన్ నిబద్ధతను, జనసేనాని రాజకీయాన్ని సంకోచిస్తున్నారు. అయితే ఈ కేసు తాలూకా ఆధారాలను గత వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో కనుమరుగు చేసేసిందని, ఇప్పుడు ఏ అధికారి వచ్చి విచారణ చేపట్టినా ఈ కేసు విషయంలో తగిన న్యాయం చేయడం అసాధ్యమనే వాదన తెర మీదకు వస్తుంది.
అయితే ఏది ఏమైనా పవన్ ఈ కేసు విషయంలో వెనకడుగు వేయకూడదని, సుగాలి ప్రీతి కేసులో బాధిత కుటుంబానికి న్యాయం చేయడం ద్వారానే పవన్ తన నిజాయితీని, తన రాజకీయ బలాన్ని నిరూపించుకోగలడని, పవన్ రాజకీయ నిబద్ధతకు సుగాలి కేసు ఒక ఇన్వెస్టిగేషన్ వంటిది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




