“రిపబ్లిక్” సినిమా వేడుక మీద పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం వలన సినిమాకు బాగా నష్టం జరిగిందని, 53 శాతం ఓట్లు వచ్చిన వైసీపీపై అలా మాట్లాడడం వలన సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమాకు వచ్చే విపరీతమైన ఓపెనింగ్స్ కూడా రాలేదని ప్రముఖ దర్శకుడు, నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘రిపబ్లిక్’ వేడుక మీద కాకుండా ‘జనసేన’ పార్టీ ఆఫీస్ లో పవన్ ఎన్నైనా తిట్టుకుని ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండేది కాదని, అతను మాట్లాడింది తప్పా? ఒప్పా? అనే విషయం నాకు సంబంధం లేదని, ఒక పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకునే హక్కు తనకుందని, కానీ సినిమా వేడుకపై ప్రసంగించడం వలన అది ‘రిపబ్లిక్’ సినిమాతో పాటు ఇండస్ట్రీకి కూడా కొంత ప్రభావం కలిగిన మాట వాస్తవమేనని అన్నారు.
పవన్ ఉద్దేశం మంచిది అయ్యుండొచ్చు, కానీ తన ఉద్దేశంలో ‘రిపబ్లిక్’ సినిమా అందరూ చూడకపోవడానికి పవన్ కల్యాణే కారణమని, ఇలా తిట్టడం వలన ఇండస్ట్రీకి మంచి కూడా జరగలేదని అభిప్రాయపడ్డారు. తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఈ వ్యాఖ్యలలో ఒకటైతే ఇప్పటికే స్పష్టమైంది. నాడు జగన్ కేంద్రంగా పవన్ చేసిన విమర్శల పర్యవసానం ఆ చిచ్చును మరింత రేపిందన్నది వాస్తవమే గానీ, రిపబ్లిక్ సినిమా ప్లాప్ కు పవన్ చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పడం ఏ మాత్రం సమంజసం కాదు.
ఓ సినిమా ప్రేక్షకులకు నచ్చితే దానిని నెత్తి మీద పెట్టుకుని చూస్తారు. రివ్యూలు రాజ్యమేలుతున్న నేటి కాలంలో కూడా ‘మౌత్ టాక్’ ప్రభావం ఏ పాటిదో ఇటీవల విడుదలైన ‘అఖండ, పుష్ప’లు నిరూపించాయి. ‘రిపబ్లిక్’ సినిమా ఒక సీరియస్ నోట్ లో సాగే పొలిటికల్ డ్రామా. ఈ సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి గానీ, ఒక జోనర్ కే పరిమితమైందన్న టాక్ ను సొంతం చేసుకుంది.
దీంతో సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ అన్నారనో, పేర్ని నాని తిట్టరానో, జగన్ మెచ్చుకున్నారనో ప్రేక్షకులు ధియేటర్లకు రారు. “ఒక సినిమా బాగుంటే వస్తారు, లేదంటే రారు, ఎవరెన్ని పబ్లిసిటీ స్టంట్ లు ఇచ్చినా ఉపయోగం ఉండదు.” ఇది సింపుల్ లాజిక్. మరి ఇండస్ట్రీలో ఇంతకాలం ఉన్న తమ్మారెడ్డి కూడా ఈ విషయాన్ని గ్రహించకుండా పవన్ పై నిందలు వేయడం ఎవరి కోసం భుజాలు కాయడమో మరి?!



