టిడిపి-బిజెపిలు ఎన్నికలలో కలిసి పనిచేస్తాయి… కన్ఫర్మ్!

TDP BJP Allianceఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని ఢిల్లీకి ఆహ్వానించి మోడీ, అమిత్‌ షాలు భేటీ అవడంతో ఏదో జరుగబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్‌లో బిజెపి మిత్రపక్షాలు (ఎన్డీయే) సమావేశంలో పాల్గొనవలసిందిగా టిడిపికి బిజెపి ఆహ్వానం పంపింది.

దీంతో ఎన్డీయేలో టిడిపి చేరడం దాదాపు ఖాయమని స్పష్టమైంది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఏపీలో టిడిపితో సహా బిజెపి మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయబోతోందని కేంద్ర సామాజిక, న్యాయ శాధికార శాఖ సహాయ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు.

ADVERTISEMENT

సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన మడకశిరలో డా.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, “2024 సార్వత్రిక ఎన్నికలలో బిజెపి మిత్రపక్షాలతో పాటు వివిద కారణాలతో బిజెపికి దూరమైన టిడిపి వంటి పార్టీలన్నిటినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్ళబోతున్నాము. ఏపీలో టిడిపి మాతో మళ్ళీ కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాము. ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకే దగ్గుబాటి పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించాము,” అని చెప్పారు.

కనుక ఇప్పుడు బంతి టిడిపి కోర్టులోనే ఉన్నట్లు స్పష్టమైంది. బిజెపి పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ, దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీని ఎదుర్కొని ఓడించాలంటే కేంద్రం సహాయసహకారాలు అవసరమని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు కనుకనే పొత్తులకు సిద్దం అవుతున్నారనుకోవచ్చు.

అయితే బిజెపితో పొత్తులు పెట్టుకొంటే ముస్లింలు, క్రీస్టియన్లు, బడుగు బలహీనవర్గాల ప్రజలు దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. బహుశః అందుకే నారా లోకేష్‌ యువగళం పాదయాత్రలో ఎక్కడికక్కడ ఆయా వర్గాలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.. పవన్‌ కళ్యాణ్‌ కూడా ముస్లింలు, క్రీస్టియన్లు, బీసీ వర్గాలతో సమావేశమవుతూ, బిజెపితో పొత్తులు వైసీపీని గద్దె దించి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోవడానికే తప్ప ఎవరికో అపకారం కోసం కాదని నచ్చజెపుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

కేంద్ర సహాయమంత్రి కూడా టిడిపితో కలిసి పనిచేస్తామని ఇవాళ్ళ చెప్పేశారు కనుక రాబోయే ఎన్నికలలో టిడిపి, బిజెపి, జనసేనలు కలిసి పనిచేసేందుకు సిద్దం అవుతున్నట్లు భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories