టిడిపి, బిజెపిలు మళ్ళీ చేతులు కలుపబోతున్నాయని, ఎన్డీయేలో టిడిపి చేరబోతోందని ఓ జాతీయ న్యూస్ ఛానల్లో వచ్చిన వార్త ఏపీ రాజకీయవర్గాలలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది జరగకూడదని గట్టిగా కోరుకొంటున్న వైసీపీ ఇదంతా టిడిపి ప్రచారం, ఆత్రమే తప్ప అటువంటిదేమీ జరిగే అవకాశం లేదని చెపుతోంది.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకే టిడిపితో చేతులు కలిపేందుకు సిద్దపడుతోందనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అందులో తప్పేమిటని ఏపీ బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే బిజెపి-టిడిపి పొత్తు గురించి ఊహాగానాలే తప్ప ఇంతవరకు ఎవరూ నిర్ధారించలేదు కానీ టిడిపి-బిజెపి పొత్తు మంచిదా కాదా?దాని వలన ఏపీకి లాభామా నష్టమా?ఈ పొత్తుతో ఎవరు లబ్దిపొందుతారు?ఎవరు నష్టపోతారు?అనే చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.
ఆ రెండూ పార్టీలు పొత్తు పెట్టుకొంటే వాటితో జనసేన కూడా కలుస్తుంది. మూడు పార్టీల మద్య సీట్ల సర్దుబాట్ల లెక్కలు కుదిరి కలిసి పోటీ చేయగలిగితే వాటి చేతిలో వైసీపీ ఓడిపోయి అధికారం కోల్పోయే అవకాశం ఉంది. కానీ సీట్ల సర్దుబాట్లలో ఏమాత్రం పొరపాటు జరిగినా మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం.
తెలంగాణలో స్థిరపడిన సీమాంద్ర ఓటర్లు 25 నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేయగలరు కనుక వారిని ఆకట్టుకొనేందుకే టిడిపితో పొత్తుకి బిజెపి సిద్దపడుతోందనే వాదన వినిపిస్తోంది. ఆ విదంగా కాగితాల మీద లెక్కలేసుకొని చూస్తే బిజెపి వ్యూహం అద్భుతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ అదే కారణంగా బిజెపి తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది!
గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టిడిపితో చేతులు కలిపినప్పుడు, తెలంగాణలో మళ్ళీ పరాయి పాలన మొదలవుతుందంటూ టిఆర్ఎస్ పార్టీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలించి మళ్ళీ అధికారం చేజిక్కించుకొంది. ఇప్పుడు బిజెపిని పరాయిపార్టీగా చూపుతూ యుద్ధం చేస్తోంది. దాంతో టిడిపి కలిస్తే టిఆర్ఎస్ మళ్ళీ ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఎన్నికలలో విజయం సాధించవచ్చు.
అయితే తెలంగాణలో బిజెపికి మేలు జరిగినా జరగకపోయినా దానికి అక్కడ దానికి తోడ్పడినందుకుగాను, ఏపీలో టిడిపి అధికారంలోకి రావడానికి బిజెపి తోడ్పడవచ్చు. కనుక ఆవిదంగా టిడిపికి మేలు జరగవచ్చు.
అయితే ఒక్కో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూలద్రోస్తూ దొడ్డిదోవలో అధికారం చేజిక్కించుకొంటున్న బిజెపి, తెలంగాణ తర్వాత ఏపీని వదిలిపెడుతుందా?బిహార్లో తమతో సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న నితీశ్ కుమార్కే ఎసరు పెట్టాలని బిజెపి ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు నాయుడుకి ఎసరు పెట్టకుండా ఉంటుందా?
ఒకవేళ వచ్చే ఎన్నికలలో బిజెపితో పొత్తులుపెట్టుకోకుండా టిడిపి సొంతబలంతోనే ఏపీలో అధికారంలోకి వచ్చినా అప్పుడూ ఇదే పరిస్థితి ఎదుర్కోకతప్పదు. అంటే బిజెపితో స్నేహం పులిమీద సవారీ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలు గుర్తుకుచేసుకోక తప్పదు. అయితే పులి మీద సవారీ చేసినా ప్రమాదమే.. అలాగని చేయకుండా దానికి దూరంగా ఉండాలనుకొన్నా అది విడిచిపెట్టదు. కనుక ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాలా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
Watch and subscribe for Exclusive Interviews:



