వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంతిమంగా ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో గానీ, రాజకీయంగా మాత్రం అత్యంత ప్రాధాన్యతను దక్కించుకుంటోంది. తాజాగా పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓ సంచలన ఆరోపణకు తెరలేపారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను కాపాడాలని, లేని పక్షంలో బీజేపీ జెండా పట్టుకుంటానని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసినట్లుగా టీడీపీ ఇంచార్జ్ చెప్పడం సంచలనమైంది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే… స్వయంగా జగనే ఈ విషయాన్ని తెలిపారట.
వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబం అంతా జగన్ వద్దకు వెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరిన సమయంలో… తాను అవినాష్ రెడ్డికి గనుక సహకారం అందించని పక్షంలో అవినాష్ బీజేపీలోకి వెళ్లాడంట అని జగన్ స్వయంగా వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులతో చెప్పినట్లుగా టీడీపీ ఇంచార్జ్ తెలిపారు.
ఇది వాస్తవమని తెలిపిన రవీంద్రనాథ్ రెడ్డి, కావాలంటే జగన్ మోహన్ రెడ్డిని గానీ, వివేకా కుటుంబ సభ్యులను గానీ అడిగి తెలుసుకోమని అన్నారు. కధ అక్కడితో ఆగలేదు, ఒకవేళ సీబీఐ కేసులో అవినాష్ రెడ్డి లోపలికి వెళితే నాయకత్వ సమస్య వస్తుంది గనుక తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లుగా పులివెందుల టిడిపి ఇంచార్జ్ ప్రస్తావించారు.
అయితే పార్టీ మారే ఆలోచనలు తనకు లేవని, ఏదైనా ఉంటే సబ్జెక్టు మాట్లాడమని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవేళ రవీంద్రనాథ్ చెప్పిందే వాస్తవం అయితే, వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అభయ హస్తం ఉందన్న విషయం జగన్ మోహన్ రెడ్డికి ముందునుండి తెలుసని తేటతెల్లం అవుతుంది.
వివేకానంద రెడ్డి హత్యలో నన్ను కాపాడాలని, లేదంటే బీజేపీ లోకి వెళ్తానని వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ని బ్లాక్ మెయిల్ చేసిన మాట వాస్తవం కాదా? @ysjagan pic.twitter.com/bfNQxRywUN
— Mareddy Ravindranath Reddy (@BTechRaviOff) January 17, 2022



