జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ పెద్దల నుంచి పిలుపు వచ్చిన్నట్లు తాజా సమాచారం. కనుక వారిని కలిసేందుకు ఫిబ్రవరి 2,3 తేదీలలో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. టిడిపి, జనసేనలు పొత్తులలో సీట్ల సర్దుబాట్లు చేసుకుని అభ్యర్ధులను ప్రకటించేందుకు సిద్దమవుతుండటంతో, ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్టానంపై పొత్తుల గురించి తాడోపేడో తేల్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఈసారి ఎన్నికలలో వైసీపి-టిడిపి, జనసేనల మద్య హోరాహోరీగా యుద్ధం జరుగబోతోంది. కనుక టిడిపి, జనసేనలతో పొత్తు పెట్టుకుంటే మంచిదని ఏపీ బీజేపీ నేతలు సూచించిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వాటితో పొత్తులు వద్దనుకున్నా ఆ విషయం త్వరగా తేల్చేస్తే తాము ఏవిదంగా ముందుకు సాగాలో నిర్ణయించుకోగలుగుతామని ఏపీ బీజేపీ నేతలు తమ అధిష్టానానికి చెప్పిన్నట్లు తెలుస్తోంది.
టిడిపి, జనసేనలు కూడా బీజేపీని తమతో కలిసి రావాలని కోరుకుంటున్నాయి. ఈ కారణంగానే అవి సీట్లు సర్దుబాట్లు చేసుకొన్నప్పటికీ తమతమ అభ్యర్ధులను ప్రకటించలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన బీజేపీ పెద్దలతో పొత్తుల గురించే అని వేరే చెప్పక్కరలేదు.
అయితే టిడిపి, జనసేనలకే ఈ సీట్ల సర్దుబాటు వ్యవహారమే ఓ ‘ఇరుకు చొక్కా’లా మారిందని పవన్ కళ్యాణ్ చెపుతున్నప్పుడు, ఆ ఇరుకు చొక్కాలోకి మరో పార్టీని కూడా ఇరికించాలనుకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా?
అప్పుడు బీజేపీ కోసం టిడిపి, జనసేనలు తమ సీట్లను త్యాగం చేయవలసి ఉంటుంది కదా?ఏ పార్టీ ఎన్ని సీట్లు వదులుకుంటుంది. వాదులుకుంటే రెండు పార్టీలలో అసమ్మతి సెగలు మొదలవుతాయి కదా?అయినా ఏపీలో బీజేపీతో పొత్తుపెట్టుకుంటే అది వైసీపికి అనుకూలంగా మారుతుందని, టిడిపి, జనసేనలకు లాభం కంటే నష్టపోయే అవకాశమే ఎక్కువని సర్వేలు కూడా చెపుతున్నాయి కదా?
కనుక ఇంతకాలం బీజేపీని తమతో చేరాలని పట్టుబట్టిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తమకు దూరంగా ఉంటూ సహకరించాలని కోరకతప్పదు. ఏపీలో శాసనసభ ఎన్నికలలో బీజేపీ గెలిచే అవకాశం ఎలాగూ లేదు. కనుక ఓడిపోయినా కొత్తగా వచ్చే నష్టం కూడా ఉండదు. కనుక బీజేపీని దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగితే టిడిపి, జనసేనలకే చాలా మేలు కలుగుతుంది.




