ఓ రాజకీయ పార్టీ తన ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించుకొని ప్రకటించడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ రెండు మూడు పార్టీలు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన ఉమ్మడి మ్యానిఫెస్టోని రూపొందించుకోవడం చాలా కష్టం. టిడిపి, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోని రూపొందించుకొని విడుదల చేశాయి.
దానిలో అవి పేర్కొన్న హామీలు, అనుసరించబోయే విధానాల గురించి వైసీపి ప్రశ్నించి ఉంటే అందరూ హర్షించి ఉండేవారు. కానీ ఆ మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ఎందుకు లేదని వైసీపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
సుదీర్గ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుకి ఇంత చిన్న విషయం తెలియకుండానే ముద్రించారనుకోలేము. వైసీపి ప్రశ్నకు ఆయన వెంటనే ధీటుగా సమాధానం చెప్పారు.
“బీజేపీ జాతీయ స్థాయి పార్టీ. లోక్సభ ఎన్నికల కోసం అది జాతీయ స్థాయికి తగ్గట్టు మ్యానిఫెస్టోని రూపొందించుకుంది. కనుక రాష్ట్ర స్థాయిలో మళ్ళీ వేరేగా మ్యానిఫెస్టో ప్రకటిస్తే గందరగోళం ఏర్పడుతుందని భావించిఓంది. అందుకే మా ఉమ్మడి మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో ముద్రించవద్దని చెప్పారు.
కానీ టిడిపి, జనసేనల ఉమ్మడి మ్యానిఫెస్టోకి బీజేపీ ఆమోదం, మద్దతు తెలిపింది. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వస్తే ఈ ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకారం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విదాల తోడ్పడుతామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ఈ ఉమ్మడి మ్యానిఫెస్టోలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి.
1. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
2. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి.
3. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు.
4. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు.
5. పోలవరంతో సహా రాష్ట్రంలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తాం.
6. ఉచిత ఇసుక విధానం మళ్ళీ అమలు చేస్తాం.
7. అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ.
8. యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి.
9. మెగా డీఎస్సీ
10. జాబ్ క్యాలండర్
11. రాష్ట్రంలో తొలిసారిగా స్కిల్ సెన్సస్ (వృత్తి నైపుణ్యాలను గుర్తింపు కోసం సర్వే)
12. వైసీపి పాలనలో కుదేలైన ఆక్వా, గ్రానైట్ తదితర రంగాలకు రాయితీలు
13. చిన్న, మద్య తరహా పరిశ్రమలకు రాయితీలు.
14. ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు. ప్రతీ 5 ఏళ్ళకు ఓసారి సర్వే.
15. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.
ఇవి కాక అనేక సంక్షేమ పధకాలను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం వాటిపై చర్చను పక్కన పెట్టి పైన పేర్కొన్న ఈ 15 హామీలను గమనించిన్నట్లయితే, వాటిలో 7-8 హామీలు రాష్ట్రాభివృద్ధికి సంబందించినవే.
వైసీపి మ్యానిఫెస్టోలో కూడా రాష్ట్రాభివృద్ధి ప్రస్తావన ఉంది కానీ వైసీపి అభివృద్ధి కంటే సంక్షేమ పధకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఈ 5 ఏళ్ళలో రుజువు అయ్యింది. కానీ చంద్రబాబు నాయుడు అభివృద్ధికి, పారిశ్రామీకరణ, టెక్నాలజీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఇదివరకే నిరూపించుకున్నారు.
చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి సంక్షేమ పధకాలు అమలుచేస్తామని చెపుతున్నారు. కానీ వైసీపి మ్యానిఫెస్టోలో సంక్షేమ పధకాలకు ఎక్కడ నుంచి డబ్బు తీసుకువస్తుందో చెప్పలేదు. అంటే మళ్ళీ అప్పులు చేస్తూ, మిగిలి ఉన్న ప్రభుత్వాస్తులను కూడా తాకట్టుపెట్టి డబ్బు తెచ్చి సంక్షేమ పధకాలు అమలుచేయబోతోందని భావించవచ్చు.
ఇప్పుడు రెండు మ్యానిఫెస్టోలు ప్రజల ముందున్నాయి. కనుక రెంటి మద్య ఈ తేడాను గమనించి సరైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. మరోసారి తప్పటడుగు వేస్తే దానికి మరో 5 ఏళ్ళు ప్రజలే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మరిచిపోకూడదు.




