టీడీపీ – జనసేన కూటమిలోకి బీజేపీ వస్తుందా…రాదా…? అనే అనుమానాలకు ఎట్టకేలకు తెరదించారు బీజేపీ అధిష్టానం. గడిచిన రెండు రోజుల ఉంచి ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జరిపిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి 2014 కూటమికి గ్రీన్ సిగ్నల్ పడింది.
అయితే ఢిల్లీలో బీజేపీ తో పొత్తు పని ముగించుకుని రాష్ట్రంలో వైసీపీ పనిపట్టడానికి తిరుగుపయనమయ్యారు ఇరు పార్టీల అధినేతలు. ఇప్పటికే పొత్తులో ఒకటైన టీడీపీ – జనసేనలు కలిసి రాష్ట్రంలో ఉమ్మడి సభలు ఏర్పాటు చేసి అటు రెండు పార్టీల కార్యకర్తలు ఏకంచేస్తూ, ప్రత్యర్థి పార్టీకి ఓటమి భయాన్ని రుచి చూపిస్తున్నాయి.
ఇప్పుడు ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా చేతులు కలపడంతో జగన్ పార్టీకి 2014 ఎన్నికల ఫలితాలు తిరిగి రుచి చూపించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఖరారైన చిలకలూరిపేటలో నిర్వహించే టీడీపీ – జనసేన పార్టీల, ఉమ్మడి సభకు బీజేపీ నుండి ప్రధాని మంత్రి మోడీ హాజరు కానున్నట్లు సమాచారం.
ఈ సభతో మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యాన్ని ఏపీ ప్రజల ముందుంచి మూడు పార్టీల కార్యకర్తలను, నాయకులను ఎన్నికలకు సంసిద్ధం చేయనున్నారు. అయితే బీజేపీ అధిష్టానం అనుకున్న విధంగా పొత్తు ధర్మానికి కట్టుబడి పని చేస్తే జగన్ సర్కారు ను గద్దె దింపడం అసాధ్యమేమీ కాదు.
ఇప్పటివరకు బీజేపీ తో పొత్తులు కోసం ఎంతో విలువైన సమయాన్ని కాలయాపనతో వృధా చేసిన ఇరుపార్టీల అధినేతలు ఇక దూకుడుగా ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెడతారు. సిద్ధం సిద్ధం…అంటూ ప్రతిపక్షాలు మీద విమర్శల యుద్ధం చేస్తున్న జగన్ సర్కార్కు కూల్చివేతల తాలూకా బాధను, భయాన్ని పరిచయం చేయడానికి బాబు, పవన్ లు సిద్ధమవుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు అంటున్నారు ఇరు పార్టీల నేతలు.
ఇన్నాళ్లుగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుని తన బలాన్ని పెంచుకున్న జగన్ కు తెలంగాణలో బిఆర్ఎస్ ను ఓడించి తెలంగాణ ప్రజలు ఒక బలాన్ని దూరం చేస్తే.., బీజేపీ తో అధికారిక పొత్తు ఖరారు చేసుకుని ఆ రెండవ బలాన్ని కూడా దూరం చేసారు బాబు, పవన్ లు. అలాగే గత ఎన్నికలలో వైసీపీ ప్రచారానికి, గెలుపుకి బలమైన జగన్ సోదరి వైస్ షర్మిల, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు జగన్ ఓటమికి నడుం బిగించారు. ఇలా గత ఎన్నికలలో జగన్ను గద్దెనెక్కించిన ఒక్కొక్కరుగా జగన్ ఓటమికి సిద్దమవ్వడం…..ఆ దేవుడి స్క్రిప్ట్ అనాలేమో మరో..!




