ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు, ఎన్నికలలో గెలుపోటములను, ప్రత్యర్ధుల సవాళ్ళు, అనూహ్యంగా పుట్టుకొచ్చే సమస్యలను తట్టుకుంటూ పార్టీ మనుగడ సాగించడం, అధికారంలోకి రావడం దేనికది చాలా క్లిష్టమైనవే.
బలమైన నాయకత్వం, బలమైన ప్రజా సంబంధాలు, రాజకీయ చతురత, దూరదృష్టి, వంటివన్నీ ఉన్నప్పుడే ఏ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీలా నాలుగున్నర దశాబ్దాలైనా ముందుకు సాగుతూనే ఉంటుంది.
దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకునే పార్టీలలో టీడీపి ప్రధానమైనది. కనుక నేడు మంగళగిరి టీడీపి ప్రధాన కార్యాలయంలో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్న మహానాడు సమావేశాలను రాష్ట్ర వ్యాప్తంగా 1875 చోట్ల ఒకేసారి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు మహానాడులో పాల్గొంటున్నారు.
నాడు ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం టీడీపిని స్థాపించి తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచారు. ఎన్టీఆర్కున్న సినీ ఇమేజ్, గౌరవం, ప్రజాధరణకు తోడు బడుగు బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో అత్యంత ప్రజాధారణ పొందింది.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు టీడీపిని మరింత బలోపేతం చేసి రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలు, ఐటి అజెండాగా ముందుకు నడిపిస్తున్నారు.
రాష్ట్ర విభజనతో, కేసీఆర్ రాజకీయాలతో తెలంగాణలో టీడీపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కానీ ఆంధ్రాలో అధికారంలోకి రాగలిగింది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని చంద్రబాబు నాయుడు మాత్రమే గాడిన పెట్టగలరనే ప్రజల నమ్మకమే అందుకు కారణం. వారి నమ్మకాన్ని ఆయన వమ్ము చేయనప్పటికీ కొన్ని తప్పటడుగులు, టీడీపి వ్యతిరేక శక్తులు ఏకం అవడం వంటివి 2019 ఎన్నికలలో టీడీపి ఓటమికి కారణమయ్యాయి.
రాజకీయాలలో గెలుపోటములు సహజమే అని అన్ని పార్టీలు చెప్పుకుంటాయి. కానీ ఓటమిని జీర్ణించుకొని ముందుకు సాగడంలో తడబడుతుంటాయి వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల్లాగ! కానీ ప్రతిపక్షంగా కూడా టీడీపి ఇతర పార్టీలకు స్పూర్తిదాయకంగా నిలిచిందనే విషయం అందరికీ తెలుసు.
ఓటమి తర్వాత 5 ఏళ్ళపాటు టీడీపి చేసిన అలుపెరుగని పోరాటాలే ప్రజలు మళ్ళీ ఆ పార్టీకి అధికారం కట్టబెట్టేలా చేశాయని చెప్పవచ్చు.
ఇప్పుడు టీడీపికి నారా లోకేష్ వంటి బలమైన నాయకుడు సిద్ధంగా ఉన్నారు. కనుక మరో 20 ఏళ్ళ వరకు టీడీపి ప్రస్తానం పూల నావలా సాగుతుంది.
కూటమిగా మూడు పార్టీల మద్య సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందున, కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ మహానాడు టీడీపి మహర్దశకు ప్రతీకగా భావించవచ్చు.




