ఈ నెల 27, 28 తేదీలలో రెండు రోజుల పాటు నెల్లూరులో అట్టహాసంగా టీడీపి మహానాడు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ ప్రధాని మోడీ చమురు పొదుపు చేసి ఖర్చులు తగ్గించుకోవాలంటూ పిలుపునివ్వడంతో మహానాడు ప్లాన్ పూర్తిగా మారిపోయింది.
టీడీపి అధినేత, సిఎం చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఎన్టీఆర్ భవన్లో పోలిట్ బ్యూరో సభ్యులతో మహానాడు నిర్వహించబోతున్నట్లు టీడీపి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి మహానాడు ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నట్లు ప్రకటించింది.
తద్వారా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి టీడీపి నేతలు, కార్యకర్తలు కార్లు, బస్సులు ఏర్పాటు చేసుకొని నెల్లూరు బయలుదేరాల్సిన అవసరం లేకుండా ఎక్కడివారక్కడే మహానాడులో పాల్గొనగలుగుతారు.
అయితే దీనిపై టీడీపి మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరుపుకునే మహానాడుతో పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రజలలలో కలిగే ఉత్సాహం, ఉత్తేజం, సంతోషం కలుగుతుంది. అప్పుడు అందరూ మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. కానీ ఈవిధంగా చేయడం వలన పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని ముందే చంపేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆవేదన, విమర్శలు నెల్లూరులో అట్టహాసంగా మహానాడు నిర్వహించనందుకేనని అర్థమవుతోంది.
సందట్లో సడేమియా అన్నట్లు టీడీపి ప్రత్యర్ధులు, ఆ పార్టీని, ప్రభుత్వాన్ని, సిఎం చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించేవారు “ప్రధాని మోడీకి ఇంతగా భయపడాలా?కనీసం ధైర్యంగా మహానాడు కూడా చేసుకోలేరా?” అంటూ నిందిస్తున్నారు.
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఒక్క భారత్లోనే కాదు… అనేక దేశాలలో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ దేశాలలో కూడా ఇటువంటి పొదుపు చర్యలు చేపట్టాయి. కనుక దేశ ప్రధాని ఓ పిలుపునిస్తే దానిని గౌరవించడం మంచిదే. కానీ దీనినీ బిజేపి-టీడీపితో ముడిపెట్టి కువిమర్శలు చేయడాన్ని ఏమనుకోవాలి?




