జగన్‌ ఫెయిల్ అయిన చోటనే చంద్రబాబు….

TDP MLAs Pension Distribution

జగన్‌ త్రిశంకు స్వర్గం వంటి వాలంటీర్ల వ్యవస్థని సృష్టించి, వారికి నామమాత్రపు జీతాలు చెల్లిస్తూ 5 ఏళ్ళు పూర్తిగావాడుకున్నారు. ఓడిపోయిన తర్వాత వారిని రోడ్డున పడేసి పోయారు! ఇప్పుడు ఆ భారం టిడిపి కూటమి ప్రభుత్వంపై పడింది.

ADVERTISEMENT

వారి జీతాలు పెంచి వారి సేవలను ఉపయోగించుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కూడా. కానీ ఇంకా విధివిధానాలు రూపొందించనందున ఇంతవరకు వారికి ఎటువంటి బాధ్యతలు అప్పగించడం లేదు. కనుక ఈ నెల కూడా సచివాలయ సిబ్బందితోనే ఇళ్ళ వద్దనే పింఛన్లు అందజేస్తున్నారు.

ఇవాళ్ళ 1వ తేదీ ఉదయం 5 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభం అయ్యింది కూడా. పలు జిల్లాలలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిడిపి నేతలు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి స్వయంగా పింఛన్ సొమ్ము అందిస్తున్నారు.

వాలంటీర్లు లేకపోతే పింఛన్లు చెల్లించడం సాధ్యం కాదనే వైసీపి నేతల వాదనలు తప్పు, అర్ధరహితమని ఇది నిరూపిస్తోంది.

వాలంటీర్ల ద్వారా ప్రజలకు డబ్బు పంచుతూ వైసీపి ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి, పనిలో పనిగా ప్రజలపై నిఘా పెట్టడానికి, ఎన్నికలలో వాడుకునేందుకే జగన్‌ వాలంటీర్ల వ్యవస్థని సృష్టించుకున్నారు. కానీ ఆ దురాలోచన బెడిసి కొట్టడంతో ఎన్నికలలో ఓడిపోయారు.

అంతేకాదు… వాలంటీర్ల వ్యవస్థని సృష్టించడం వలననే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయింది. అది కూడా వైసీపి ఓటమికి ఓ కారణమే. జగన్‌ ఇది ముందే గ్రహించి ‘గడప గడపకి ప్రభుత్వం’ కార్యక్రమంలో తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల మద్యకు తప్పనిసరిగా వెళ్ళాలని ఒత్తిడి చేసేవారు. కానీ జగన్‌ నిర్వాకం వలననే వారు ప్రజల మద్యకు వెళ్ళేందుకు భయపడేవారు. ప్రజలు కూడా వారిని చీత్కరించుకునేవారు.

సిఎం చంద్రబాబు నాయుడు నిశిత దృష్టి నుంచి ఇది జారిపోలేదు. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిడిపి నేతలు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రోత్సహించారు. వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జగన్‌ భజన చేస్తూ ప్రజలకు దూరమైనప్పుడు, టిడిపి నేతలందరూ ప్రజల మద్యనే ఉన్నారు. ఇప్పుడు వారే స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు.

అప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తే చీత్కరించిన ప్రజలే ఇప్పుడు ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూస్తున్నారు. అంటే జగన్‌ ఎక్కడ ఫెయిల్ అయ్యారో సరిగ్గా అక్కడే చంద్రబాబు నాయుడు పాస్ అయ్యారన్న మాట!

ADVERTISEMENT
Latest Stories