టిడిపి సీనియర్ నేత బచ్చుల అర్జునుడు ఇక లేరు

Bachula Arjunudu Passed Awayటిడిపి సీనియర్ నేత, గన్నవరం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జ్‌, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గురువారం సాయంత్రం విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఎల్లప్పుడూ పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే బచ్చుల ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిన్నట్లు గుర్తించి వెంటనే స్టంట్ వేశారు. ఆ తర్వాత కొంత కోలుకొన్నప్పటికీ, బీపీ పెరిగిపోవడంతో గురువారం సాయంత్రం హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.

బచ్చుల అర్జునుడు 1995లో టిడిపిలో చేరి అప్పటి నుంచి పార్టీనే అంటిపెట్టుకొని పనిచేస్తూ అత్యంత విశ్వసనీయుడైన వ్యక్తిగా, మంచి సమర్ధుడైన నాయకుడిగా పార్టీలో, బయట కూడా మన్ననలు పొందారు. ఆయన 1995 నుంచి 5 సంవత్సరాలపాటు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుగా సేవలు అందించారు. 2000 నుంచి 2005 వరకు మచిలీపట్నం మున్సిపల్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన పార్టీకి చేస్తున్న సేవలని గుర్తించి చంద్రబాబు నాయుడు 2014లో ఆయనని కృష్ణా జిల్లా టిడిపి అధ్యక్షుడుగా నియమించారు.

ADVERTISEMENT

అప్పటి నుంచి జిల్లాలో టిడిపిని బలోపేతం చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఆయన పని తీరు చూసి చంద్రబాబు నాయుడు 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ తర్వాత 2020లో టిడిపి కేంద్ర క్రమశిక్షణా కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు.

రాబోయే శాసనసభ ఎన్నికలలో బచ్చుల అర్జునుడు మచిలీపట్నం నుంచి పోటీ చేసి వైసీపీ ఎమ్మెల్యే పేర్నినానిని ఓడించాలని చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. కానీ ఇంతలోనే భగవంతుడి పిలుపు రావడంతో వెళ్ళిపోయారు. టిడిపికి అత్యంత కీలకమైన ఉమ్మడి కృష్ణాజిల్లాలో మంచి ప్రజాధారణ కలిగిన బచ్చుల వంటి సీనియర్ నేతని కోల్పోవడం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బే. ఈనెల 29వ తేదీతో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియనుంది. కానీ అంతకంటే ముందే ఆయన కానరాని లోకాలకి వెళ్ళిపోయారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు, జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేతలు బచ్చుల ఆకస్మిక మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. రేపు మధ్యాహ్నం మచిలీపట్నంలో ఆయన అంత్యక్రియలు జరుగునున్నాయి.

ADVERTISEMENT
Latest Stories