విజయనగరంలో అయ్యప్ప నగర్లోని సాయి అమృత రెసిడెన్సీవాసులు చెత్తపన్ను చెల్లించలేదని మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై చెత్త తీసుకువచ్చి అపార్టుమెంట్లో పారబోశారు. ఈ విషయం తెలుసుకొన్న స్థానిక టిడిపి నేతలు కమీషనర్ను గట్టిగా నిలదీశారు.
విజయనగరంలోని 1వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జి మరియు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షురాలు మురగడాపు పార్వతి అధ్వర్యంలో నగర టిడిపి అధ్యక్షుడు కర్రోత్తు నర్సింగరావు, కార్యదర్శి ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, టిడిపి టిడిపి నాయకులు నక్కిళ్ళ శ్రీనివాసరావు, బొద్దాన లక్ష్మణరావు, మైలీపల్లి పైడిరాజు, గొల్లకోటి శివ తదితరులు సాయి అమృత రెసిడెన్సీ వద్దకు వెళ్ళి దానిలో నివశిస్తున్నవారితో మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొన్నారు.
అనంతరం నగర మున్సిపల్ కమీషనర్ శ్రీరాములునాయుడిని కలిసి గట్టిగా నిలదీశారు. నగరంలో గోతులు పడిన రోడ్లకు మరమత్తులు చేయకుండా, ఎక్కడికక్కడ పేరుకుపోయిన మురుగు కాలువలను పట్టించుకోకుండా ప్రజలను ఎందుకు వేధిస్తున్నారని గట్టిగా నిలదీశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే ప్రజలతో కలిసి మీ కార్యాలయం ఎదుటే ధర్నా చేయాల్సివస్తుందని హెచ్చరించారు. తక్షణమే సాయి అమృత రెసిడెన్సీలో పారబోసిన చెత్తను తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం చెత్తపన్నును రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.



