తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుండి బయటకు వచ్చాక టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు మొత్తానికి ఫ్రీ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా ఎన్డీయేలో ఉండి ఖచ్చితంగా మాట్లాడలేకపోయిన ఆయన మొత్తానికి ఇప్పుడు ఓపెన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన కూడా అదే మాట అంటున్నారు.
ఎన్డీయేలో ఉన్నంత వరకు ఇతర పార్టీలతో మాట్లాడేందుకు తమకు ఇబ్బందులు ఉండేవని, ఇక తనకు ఏ మొహమాటాలూ లేవన్నారు. అన్ని జాతీయ పార్టీలను కలుపుకొని వెళ్తానని సీఎం స్పష్టంచేశారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ కేంద్రంపైనే అవిశ్వాసతీర్మాణం పెడుతుంది. ఇదే సమయంలో వైకాపా అవిశ్వాసతీర్మానాన్ని ఆయన ఎద్దేవా చేసారు.
ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీల కోసం రెండు నెలల నుంచి వైకాపా అవిశ్వాసం అంటున్నా ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదని ఆయన అన్నారు. పీఎంవో చుట్టూ చక్కర్లు కొట్టే అవిశ్వాసాన్ని ఎవరూ నమ్మలేదన్నారు. తాను ఏ పార్టీలతో మాట్లాడకపోయినా.. తెదేపా అవిశ్వాసం పెట్టగానే అనేక పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చాయన్నారు. అది జాతీయ పార్టీలకు తెదేపా పట్ల ఉన్న విశ్వసనీయత అన్నారు.



