తమకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే ఓ సైనికుడు, తమ పట్ల అధికారుల తీరును దేశ ప్రజలందరికీ తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతని భార్య షర్మిల ఇటీవలే మీడియా ముందుకు వచ్చి తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని పేర్కొనడంతో అధికారులు ఆమె ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే మరోసారి షర్మిల తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకు వచ్చారు.
తన భర్త ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టినప్పటి నుంచి ఆయన కనిపించడం లేదని పేర్కొంది. తన భర్తతో కనీసం ఫోన్లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ఈ రోజు ఈ రోజు ఢిల్లీ హైకోర్టులో హెబియస్ కార్పస్ కింద పిల్ ను దాఖలు చేశారు. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్ నోటీసులు పంపించనుంది. గతంలో సదరు జవాన్ వీఆర్ఎస్ తీసుకోవాలనుకున్నప్పటికీ, అధికారులు అంగీకరించకుండా టార్చర్ పెడుతున్నారని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
సదరు జవాన్ సోదరుడు విజయ్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు తాము బీఎస్ఎఫ్ అధికారులకు రెండు లేఖలు రాశామని, పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని, ఇంకొన్ని సార్లు ఫోన్ హోల్డ్ లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్ చేసి పక్కన పెట్టేస్తున్నారని ఆరోపణలు చేసారు. దీంతో అధికారుల తీరుపై దేశప్రజల్లో నెగటివ్ సంకేతాలు వెళ్తున్నాయి. సదరు జవాన్ చూపించిన సమస్యను పరిష్కరించకపోగా, జవాన్ నోరు మూయించేలా అధికారులు ప్రవర్తించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.



