తెలంగాణలో మొదట బిఆర్ఎస్ పార్టీకి తిరుగే లేదన్నట్లు ఉండేది. ‘బంగారి తెలంగాణ’ పేరుతో కాంగ్రెస్, టిడిపిలను నిర్వీర్యం చేయడం ద్వారా బిఆర్ఎస్ బలపడింది. అయితే కేసీఆర్ ఊహించనివిదంగా కాంగ్రెస్ స్థానంలోకి బిజెపి ప్రవేశించి కేవలం మూడేళ్ళలో బిఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగింది.
కానీ రాష్ట్ర బిజెపిని నిలువరించే ప్రయత్నంలో కేసీఆర్ పెద్ద తప్పటడుగు వేశారు. అదే కేంద్రంతో యుద్ధం ప్రారంభించడం! తద్వారా రాష్ట్రంలో బిజెపిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడమే కాకుండా భవిష్యత్లో తాను జాతీయస్థాయి నాయకుడుగా ఎదిగేందుకు కూడా ఈ వ్యూహం దోహదపడుతుందని భావించిన్నట్లున్నారు. కానీ అదే బెడిసికొట్టింది.
అదే… ఆయన ఎప్పటిలాగే మోడీ, అమిత్ షాలతో స్నేహం కొనసాగిస్తూ ఉండి ఉంటే తెలంగాణలో బిజెపిని ఎవరూ నమ్మేవారు కారు. దాని విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా ఉండేది. దాంతో తెలంగాణలో బిజెపి ఎదగలేకపోయేది కదా?
కానీ కేసీఆర్ స్వయంగా తమపై కత్తులు దూయడంతో, సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే అల్లుకుపోతూ తెలంగాణలో బిజెపిని చాలా బలోపేతం చేశారు. కేసీఆర్కు సింహస్వప్నంలా మారి అలుపెరుగని పోరాటాలు చేస్తూ బిజెపిని గెలుపు ముంగిటకు తెచ్చి నిలబెట్టారు.
ఈసారి బిజెపి అధిష్టానం పప్పులో కాలేసింది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు బిజెపి అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేయడంతో బండి సంజయ్ని ఆ పదవిలో నుంచి తప్పించేసి పార్టీని స్వయంగా దెబ్బతీసుకొంది. ఈసారి బిజెపి తప్పక గెలుస్తుందనే ప్రజలకు పార్టీపై అపనమ్మకం ఏర్పడేలా చేసుకొంది. కనుక కేసీఆర్కి బలమైన శత్రువు యుద్ధానికి ముందు అస్త్ర సన్యాసం చేసిన్నట్లు భావించవచ్చు.



