ఏపీ సమస్యలు అందరికీ అలుసే… రాజకీయ మైలేజి ఇచ్చేవే!

Revanth Reddy Sharmila

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంతోషించడట! రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్‌ అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. వాటన్నిటి వలన రాష్ట్రానికి ఎంతో నష్టం, అన్యాయం జరుగుతోంది. కొన్నిటికి విభజన కారణమైతే మరికొన్ని పాలకుల స్వయంకృతాలు కారణం.

వీటన్నిటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, ప్రజలు భారీగా మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. కానీ వీటన్నిటికీ కారణమైన ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్రంలో మళ్ళీ పుంజుకొనేందుకు ఈ సమస్యలనే ఓ చక్కటి రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తోంది.

ADVERTISEMENT

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రతీరోజు ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణ, అమరావతి రాజధాని, పోలవరం వంటి సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

నిన్న కాంగ్రెస్‌ అధ్వర్యంలో విశాఖలో జరిగిన ‘న్యాయ సాధన సభ’లో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కూడా, ఈ సమస్యలు ప్రస్తావించి ఏపీ కాంగ్రెస్‌కు 25 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం, షర్మిలమ్మ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం గమనిస్తే, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యలతో ఏపీ కాంగ్రెస్ పార్టీ వాడుకోవాలని అనుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.

ఇదివరకు కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తన బిఆర్ఎస్ పార్టీని విస్తరించాలని అనుకున్నప్పుడు ఆయన కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణ అంశాన్ని ఏవిదంగా వాడుకోవాలని ప్రయత్నించారో అందరూ చూశారు.

అంతకు ముందు అమరావతి నిర్మాణం కాకుండా అడ్డుకునేందుకు మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించేందుకు సాయపడ్డారు. తర్వాత ఐదేళ్ళ జగన్‌ పాలనలో ఏపీలో జరిగిన విధ్వంసాన్ని అందరూ చూశారు. స్వయంగా అనుభవిస్తున్నారు కూడా.

ఇప్పుడు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఏపీ కాంగ్రెస్‌ వాడేసుకోవాలని ఆరాటపడుతోందని నిన్నటి సభలో స్పష్టమైంది. అన్న స్థాపించిన రాజన్న రాజ్యాన్ని చూశాము.

ప్రజలు అవకాశం ఇస్తే చెల్లి కూడా మరో రాజన్న రాజ్యం స్థాపించుకుంటారట! ఇలా ఎవరికి వారు రాజ్యాలు స్థాపించుకోవడానికి, వారిని ముఖ్యమంత్రులను చేయడానికే ఏపీ ప్రజలున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఇలా ఎల్లకాలం ఎవరో ఒకరిని నమ్మి మోసపోతూనే ఉంటారా?తమ నమ్మకంతో ఇలా ఆడుకొంటున్నవారిని క్షమించేస్తూ, ఒకరి తర్వాత మరొకరిని భుజానికి ఎత్తుకొని మోస్తూనే ఉంటారా?ఆలోచించుకోవాలి. అందుకు ఇంకా 57 రోజులు సమయం కూడా ఉంది.

ADVERTISEMENT
Latest Stories