తెలంగాణ శాసనసభ ఎన్నికలు నవంబర్ 30న జరుగబోతున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. గత రెండు ఎన్నికలలో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా చాలా అనుకూల వాతావరణం ఉంది. కానీ ఈసారి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బిఆర్ఎస్ పార్టీకి గట్టి సవాలు విసురుతోంది.
ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలంగాణ ప్రజల నోట వినిపిస్తోంది. అంటే ప్రజలు మార్పు కోరుకొంటున్నారన్న మాట. బహుశః ఈవిషయం అన్ని పార్టీల నేతలు కూడా గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే బెల్లం మీద ఈగలు వాలినట్లు అందరూ కాంగ్రెస్లో చేరిపోతున్నారు. వారి చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు సూచిస్తున్నట్లే భావించవచ్చు.
కొన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని సూచిస్తుంటే, మరికొన్ని కాంగ్రెస్-బిఆర్ఎస్ రెండు పార్టీలకు సరిసమాన అవకాశాలు ఉన్నాయని జోస్యం చెపుతున్నాయి. మరికొన్ని మాత్రం బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవచ్చునని చెపుతుండగా కొన్ని సర్వేలు బిఆర్ఎస్ పార్టీ బొటాబోటి మెజార్టీతో అయినా గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని సూచిస్తున్నాయి.
అయితే బిఆర్ఎస్ పార్టీ ఈసారి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొంతుందని కేసీఆర్ గట్టి నమ్మకంతో చెపుతున్నారు. మొత్తం 119 సీట్లకి కనీసం 90 నుంచి 100 సీట్లు తప్పక గెలుచుకొంటామని చెపుతున్నారు. ఆయన ఎప్పుడూ తమ పార్టీయే గెలుస్తుందని చెప్పుకొంటుంటారు. కానీ గత లోక్సభ ఎన్నికలలో ఆయన అంచనాలు పూర్తిగా తప్పాయి. ఈసారి తెలంగాణలో రాజకీయ వాతావరణం, ప్రజల మూడ్ రెండూ కూడా మారాయి కనుక బిఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పకపోవచ్చు.
అయితే బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీలు పూర్తి మెజార్టీతో గెలిస్తే పర్వాలేదు. కానీ బిఆర్ఎస్ పార్టీ బొటాబొటి సీట్లతో గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నష్టం తప్పదు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలని కేసీఆర్ తప్పకుండా బిఆర్ఎస్ పార్టీలోకి లాగేస్తారు. లేదా గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బిఆర్ఎస్ పార్టీలోకి దూకేస్తారు. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే దానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఓడిపోతే దానికి బహుశః ఇవే చివరి ఎన్నికలు కావచ్చు.






