కొన్ని నెలల క్రితం వరకు ఆంధ్రాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు “వేతన సవరణ చేయాలి… డీఏ బకాయిలు చెల్లించాలి…. ఓపిఎస్ రద్దు చేయాలి… లేకపోతే నిరసనలు చేస్తాం… విజయవాడ వచ్చి ఆందోళనలు చేస్తాం,” అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించేవారు.
కానీ ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలందరూ కూడా హటాత్తుగా జగన్ భజన చేయడం ప్రారంభించారు. అంటే వారి డిమాండ్లన్నిటినీ ఆయన రాత్రికి రాత్రే పరిష్కరించేశారా?అంటే లేదని అందరికీ తెలుసు. కానీ ఉద్యోగ సంఘాల నేతలు హటాత్తుగా ఎందుకు చల్లబడిపోయారు?అంటే కారణాలు అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు నెలనెలా జీతాలు ఇస్తే అదే చాలనుకొనే స్థితికి చేరుకొన్నారు.
పొరుగున తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు అప్పుడే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. అది నివేదిక సమర్పించడానికి ఆరు నెలలు సమయం పడుతుంది కనుక ఈ నెల 1 నుంచే ఉద్యోగులు, పింఛనుదారులు అందరికీ 5 శాతం మధ్యంతర భృతి (ఇంటెరిమ్ రిలీఫ్) కూడా మంజూరు చేస్తూ సోమవారమే జీవో జారీ చేసింది.
ఏపీలో జగన్ ప్రభుత్వం కూడా పీఆర్సీ అంది కానీ ఇంతవరకు ఉలుకుపలుకూ లేదు. అయినా నెలనెలా జీతాలు చెల్లించడానికే ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నప్పుడు, వేతన సవరణ ఎలా, ఐఆర్ ఎలా ఇవ్వగలదు?
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, అన్ని సమస్యలను చక్కదిద్ది తెలంగాణ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. అంత క్లిష్ట పరిస్థితులలో చంద్రబాబు నాయుడు ఏనాడూ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం చేయలేదు.
అంతే కాదు… 2019 ఎన్నికలకు వెళ్ళే ముందు మరోసారి పీఆర్సీ ప్రకటించి, ఏకంగా 20శాతం మధ్యంతర భృతి మంజూరు చేశారు. అటువంటి క్లిష్ట పరిస్థితులలోనే ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ టిడిపి ప్రభుత్వం ఇవ్వగలిగినప్పుడు, తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపి ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతోంది?డీఏలు పెంచామని చెప్పి జీతాలు ఎందుకు కోయవలసి వచ్చింది?డీఏ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?కనీసం నెలనెలా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి ఎందుకు ఏర్పడింది?
ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమ పధకాలు, వాటితో పడే ఓట్లే తప్ప ఉద్యోగులు కాదు కనుక అని సరిపెట్టుకోవలసి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను కూడా కలుపుకుపోతూ వారి ఓట్లు కూడా పొందబోతోంది. రెండు ప్రభుత్వాల ఆలోచనా విధానం, పనితీరులో ఎంత తేడా!



