2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఎంత సంచలనం సృష్టించిందో, ఆ హత్య కేసుపై విచారణ అంతకంటే సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడిన ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు నేడు రద్దు చేసింది. మే 5వ తేదీలోగా సీబీఐకి లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగినప్పుడు సీబీఐ తరపు న్యాయవాది చాలా ముఖ్యమైన అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
1. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్పై బయట తిరుగుతుండటం వలన ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు అందరూ భయపడుతున్నారు.
2. ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది.
3. చట్టపరమైన బెయిల్ పొందిన ఎర్ర గంగిరెడ్డివంటి వారిని కేసు పూర్వాపరాలు, తీవ్రత, నిందితుడి పాత్రను పరిగణనలోకి తీసుకొని బెయిల్ రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది.
4. ఈ కేసు దర్యాప్తుకి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం సరిగ్గా దర్యాప్తు చేయలేకపోయినందునే ఈ కేసు సీబీఐకి అప్పగించబడింది. కనుక ఎర్ర గంగిరెడ్డి బెయిల్ విషయంలో సిట్ వేసిన కౌంటర్ను పరిగణనలో తీసుకోరాదు.
5. వివేకా హత్యకు ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నంతకాలం సీబీఐ విచారణకు ఆటంకం కలిగిస్తూనే ఉంటారు. కనుక ఆయన బెయిల్ రద్దు చేసి తక్షణం అరెస్ట్ చేయడం చాలా అవసరం.
ఈ కేసులో మరో సూత్రధారి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై కూడా తెలంగాణ హైకోర్టు మరికొద్ది సేపటిలో విచారణ చేపట్టవలసి ఉంది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ ఉత్తర్వుల కాపీ నేడు హైకోర్టు చేతికి అందితే ఆయన పిటిషన్ కూడా కొట్టివేయడం, అందుకోసమే ఎదురు చూస్తున్న సీబీఐ వెంటనే ఆయనను రెస్ట్ చేయడం కూడా ఖాయమే అని భావించవచ్చు. కనుక ఇవాళ్ళ ఒకేరోజున వివేకా హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితులకు వ్యతిరేకంగా తీర్పులు రావడం చాలా కీలకమైన పరిణామమే అని చెప్పవచ్చు.



