తెలంగాణలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దమయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామా పంచాయితీ కి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం ఐదు దశలలో ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణికుముదిని.
అయితే తొలి రెండు దశలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, ఇక మిగిలిన మూడు విడుతలలో గ్రామ పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రకటించారు ఎస్ఈసీ.
ఇందులో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ లకు అక్టోబర్ 23 న తొలి విడతగా, 27 న రెండో విడతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 31న తోలి దశగా, నవంబర్ 4, 8 తేదీలలో రెండు, మూడు విడుతలలో ఈ స్థానిక ఎన్నికల తంతుకు ముగింపు పలకనున్నారు.
తెలంగాణలో మోగిన ఈ ఎన్నికల నగారా తో తెలంగాణలో రాజకీయం రంగు మార్చుకోబోతుందా.? అనే చర్చ ఊపందుకుంది. అధికార కాంగ్రెస్ ను దాటుకుని, బిఆర్ఎస్ లో కవిత రేపిన కల్లోలాన్ని తట్టుకుని, కాళేశ్వరం – ఈ ఫార్ములా కేసులను మరిపించి గులాబీ కారు తెలంగాణ రాజకీయాలలో తిరిగి తన వేగాన్ని పెంచుకుంటుందా.?
ఇక రాష్ట్ర అధ్యక్ష మార్పులతో టి. బీజేపీలో రేగిన అంతర్గత కల్లోలాన్ని బీజేపీ సరిదిద్దుకుని అటు అధికార కాంగ్రెస్ కు ధీటుగా ఇటు ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో కాషాయ కమలం వికసిస్తుందా.? స్థానిక ఎన్నికలలో బీజేపీ తన సత్తా చాటి తెలంగాణ రాజకీయ నెంబర్ గేమ్ లో అడుగు ముందుకేస్తుందా.?
అలాగే రేవంత్ సర్కార్ సైతం రైతుల యూరియా సమస్యను దాటుకుని, భారీ వర్షాలు తెచ్చిన బురదను కడుక్కుని, హైడ్రా కూల్చివేతలను తట్టుకుని స్థానిక ఎన్నికలలో గెలుపు గుర్రంగా నిలబడగలుగుతుందా.? పదేళ్ల తరువాత కాంగ్రెస్ చేతికొచ్చిన అధికారాన్ని హస్తం చేజార్చుకోకుండా కాపాడుకోగలుతుందా.? ఇలా అనేక ప్రశ్నలు ఈ మూడు పార్టీలను వెంటాడుతున్నాయి.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ – బీజేపీ ల మధ్య జరగబోయే ఈ ట్రై యాంగిల్ రాజకీయ యుద్ధం తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రాన్ని ఏ దిశగా ముందుకు తీసుకెళ్ళనుందో మరికొన్ని రోజులలో తేలనుంది. అలాగే ఇటు జాగృతితో కవిత అటు టీఆర్పీ తో తీన్మార్ మల్లన్న రాజకీయంగా తమ తొలి అడుగు వేయనున్నారా అన్న దాని మీద కూడా ఒక స్పష్టత రానుంది.




