ఏపీలో అధికార వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న తీరు, సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేస్తున్న వెకిలి సందేశాలను రాష్ట్ర ప్రజలే కాదు… పొరుగు రాష్ట్రంలో తెలంగాణ మంత్రులు కూడా అసహ్యించుకొంటున్నారు.
తెలంగాణ సిఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ జాతీయస్థాయి నాయకుడు. కనుక ఆయన రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా అవలీలగా గెలుస్తారు. ఈసారి ఆయన గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయబోతుండటంపై ప్రతిపక్షాలు నోటికి వచ్చిన్నట్లు వాగుతున్నాయి. మేము కూడా వారికి అర్దమయ్యే భాషలోనే ధీటుగా జవాబు చెప్పగలము.
కానీ ఆ విదంగా చేస్తే ఆంద్రాలో రాజకీయపార్టీల నేతల్లాగ మేము కూడా ప్రజలలో చులకనవుతాము. ఆంద్రా నేతలు బూతులు మాట్లాడుతూ, ప్రత్యర్ధులను వ్యక్తిగత విషయాలను ప్రస్తావించి అవహేళన చేస్తూ చాలా చవుకబారుగా వ్యవహరిస్తున్నారు. కానీ మేము వారిలాగా లేకిగా ప్రవర్తించి మా గౌరవం దిగజార్చుకోలేము. మా ప్రత్యర్దులు ఎవరైనా, ఎక్కడివారైనా మేము వారి విమర్శలకు హుందాగానే బదులిస్తాము తప్ప నోటికి వచ్చిన్నట్లు మాట్లాడబోము,” అని అన్నారు.
త్వరలో జరుగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీయే మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని అన్నారు.
తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్న ఈ మాటలు వైసీపీ నేతలను ఉద్దేశ్యించే అని అర్దమవుతూనే ఉంది. మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కొడాలి నాని వంటివారు మాట్లాడే మాటలను పొరుగు రాష్ట్రంలో ప్రజలు, నేతలు కూడా చాలా నిశితంగా గమనిస్తున్నారని, వారి మాట తీరుని తప్పు పడుతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి మాటలతో స్పష్టమైంది.
మంత్రిగా ఆయన తన సూర్యపేట జిల్లాను, పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపారు కూడా. అందుకే సిఎం కేసీఆర్కు, తెలంగాణ ప్రజలకు కూడా ఆయనంటే అభిమానం. మన మంత్రులు, ఎమ్మెల్యేలకు రాష్ట్ర ప్రజలు గౌరవిస్తారా?నేటికీ ఏపీలో చాలామంది ప్రజలకు మంత్రుల పేర్లు తెలియవు… వారు ఏ శాఖల మంత్రులో అసలే తెలియదంటే అతిశయోక్తి కాదు.
ఎందుకంటే మంత్రులలో ఏ ఒక్కరూ మీడియా సమావేశాలలో లేదా సోషల్ మీడియాలో తమ శాఖలకు సంబందించిన విషయాలు మాట్లాడరు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లను ఉద్దేశ్యించి అవహేళనగా మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంటారు కనుక!



