ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’పై తెలంగాణా మంత్రి కేటీఆర్ స్పందించారు. “ఏపీలో రాజకీయ ఆధిక్యత పెచ్చుమీరుతోందని, ఒకరినొకరు విమర్శించుకోవడానికి తప్ప, అసలు ‘ప్రత్యేక హోదా’ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారని, హోదాపై ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తున్నారని, నిలకడ లేని రాజకీయాలతో రాష్ట్రానికి ఉపయోగం ఉండదని” కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇక, పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ… ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయన్న చందంగా, ‘జనసేన’ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రం పరిమితమవుతుందని కాకినాడ సభ నిరూపించిందని అన్నారు. ‘విభజన జరిగిన తర్వాత 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కళ్యాణ్ అంటే తెలంగాణా ప్రజలకు బాధ కలగదా? అంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి తప్ప ఏపీలో నిజంగా ‘ప్రత్యేక హోదా’ కోసం ఎవరూ పాటుపడడం లేదని అన్నారు.
ఏపీకి నిజమైన న్యాయం చేయగల పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ వలనే ఏపీకి ప్రయోజనాలు చేకూరుతున్నాయని అన్నారు. విద్యాసంస్థలు, పోర్టులు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, ప్యాకేజ్ లు ఇలా ఎన్నో ప్రయోజనాలు వస్తున్నాయంటే… దానికి కారణం టీఆర్ఎస్ పార్టీనే అంటూ తనదైన లాజిక్ ను వాడారు కేటీఆర్.



