పూల నావలా సాగిపోతున్న అల్లు అర్జున్ జీవితాన్ని రెండు ఘటనలు సమూలంగా మార్చేశాయి. పుష్ప-2 సూపర్ డూపర్ హిట్ అయ్యి కేవలం నెలరోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,800 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డులు తిరగ రాసింది. దీంతో అల్లు అర్జున్ పేరు యావత్ దేశం మారుమ్రోగి పోతోంది. ఇప్పుడు ఆయన చేయబోయే ప్రతీ సినిమా అంతకు మించే ఉండాలి తప్ప తగ్గేందుకు వీల్లేదు. ఓ విదంగా ఇది ఆయనకు ఓ కొత్త సమస్యే అని చెప్పొచ్చు.
ఆయనకు ఇంత పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన పుష్ప-2 కారణంగానే అల్లు అర్జున్ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని అవమానాలు, విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. పైగా రాజకీయ, చట్టపరమైన సమస్యలన్నీ ఒకేసారి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి కూడా.
పుష్ప-2 ఇంత పెద్ద హిట్ అయినా తన సినిమా విజయాన్ని ఆనందించలేని పరిస్థితిలో నేనున్నానని అల్లు అర్జున్ స్వయంగా చెప్పుకున్నారు.
నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది కానీ ఆయన కష్టాలు ఇంకా తీరలేదు. ప్రతీ ఆదివారం పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేసి వెళ్ళాల్సి వస్తోంది. ఇవాళ్ళ మొదటిసారి వచ్చి సంతకం చేసి వెళ్ళారు కూడా.
అల్లు అర్జున్ ఇప్పుడు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో ఇదివరకులా హ్యాపీగా, నిశ్చింతగా సినిమాలు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
సంధ్య థియేటర్ ఘటనతో అల్లు అర్జున్ జీవితం అంతా ఒక్కసారిగా ఇంతగా తారుమారు అయిపోవడం ఆశ్చర్యం, బాధ కలిగిస్తుంది.
ఆ ఘటనలో గాయపడి హైదరాబాద్, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చావు బ్రతుకుల మద్య ఊగిసలాడుతుంటే, అల్లు అర్జున్తో సహా సినీ పరిశ్రమలో ఏ ఒక్కరూ వెళ్ళి పరామర్శించలేదని సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఆ బాలుడిని పరామర్శించబోతే రావద్దని పోలీసులు సూచించారు. ఒకవేళ వస్తే మళ్ళీ అక్కడ ఏదైనా అఅవాంఛనీయ ఘటన జరిగితే దానికి మీదే బాధ్యత ని పోలీసులు హెచ్చరించారు.
ఆ బాలుడిని అల్లు అర్జున్ పరామర్శించలేదని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగితే, పరామర్శకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
బహుశః అల్లు అర్జున్ జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇటువంటి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కొని ఉండరేమో? ప్రెస్మీట్లో ఆయన మాటలు విన్నప్పుడు ఎవరికీ ఆయనపై జాలి కలిగి ఉండక పోవచ్చు. కానీ ఇవన్నీ చూస్తే ఎవరైనా జాలిపడతారు. సినీ పరిశ్రమలో ఈ స్థాయికి ఎదిగిన అల్లు అర్జున్కి ఈ జాలిని భరించడం కూడా శిక్షవంటిదే కదా?




