రాజకీయ నాయకులు మాట్లాడే చాలా మాటలు ప్రజలు యధాలాపంగా వినేసి చప్పట్లు కొట్టేస్తుంటారు. అలాంటి వాటిలో ఇవీ కొన్ని.
సోనియా గాంధీ దయతలిచి తెలంగాణ ఏర్పాటు చేశారు… చప్పట్లు!
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మా లక్ష్యం. అంతవరకు నిద్రపోము… చప్పట్లు!
కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకు మా పోరాటాలు ఆగవు… చప్పట్లు!
2047 కల్లా భారత్ అగ్ర రాజ్యంగా మారుతుంది… చప్పట్లు!
ఇంకా ఇలాంటి మాటలు చాలానే వినిపిస్తుంటాయి. కానీ కాస్త ఆలోచిస్తే అవి చాలా విచిత్రంగా కనిపిస్తాయి.
నాడు డా.మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ సోనియా గాంధీ వలననే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు చెపుతుంటారు కనుక ఆయన ఆమోదం, ప్రమేయం లేకుండానే తెలంగాణ ఏర్పడిందనుకోవాలి. ప్రధానిని పక్కన పెట్టి యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్ర విభజన చేయగలరా? కానీ చేశారంటే అర్ధం ఏమిటి?
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే మా లక్ష్యం. అంతవరకు నిద్రపోమని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెపుతుంటారు. కానీ రోజూ నిద్రపోతూనే ఉంటారు. అది వేరే విషయం.
కానీ రాహుల్ గాంధీ రాజకీయాలలో దూసుకుపోయి తనంతట తాను ప్రధాని కాలేరా?దేశంలో కాంగ్రెస్ నేతలందరూ తలో చెయ్యి వేసి అయనని ప్రధానిని చేసుకోవాలా?
అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సొంతంగా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేనప్పుడు, ఇండియా కూటమిలో పలు పార్టీల నేతలు ప్రధాని పదవి ఆశిస్తున్నప్పుడు, వారందరి మద్దతు లేకుండా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ప్రధానిని చేయగలరా?
రాహుల్ గాంధీ కూటమిలో నేతలతో పోటీ పడగలరా?అనే ధర్మ సందేహాలు పక్కన పెట్టి రాహుల్ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్న కాంగ్రెస్ నేతలకు చప్పట్లు కొట్టాల్సిందే!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ, “కేసీఆర్ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసే వరకు మా పోరాటాలు ఆగవు,” అని తేల్చి చెప్పేశారు.
యావత్ తెలంగాణ ప్రజలని, పార్టీలని ఏకం చేసి పదేళ్ళకు పైగా ఉద్యమాలు చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత దాదాపు మరో పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ‘నా మాటే శాసనం’ టైపులో పాలించారు. అలాంటి కేసీఆర్ని గెలిపించుకోవాలని కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు చెపుతున్నప్పుడు జనాలు చప్పట్లు కొడుతుంటారు.
కానీ బీఆర్ఎస్ నేతలు తలో చెయ్యి వేసి గెలిపించుకుంటే తప్ప గెలవలేని దయనీయ స్థితిలో కేసీఆర్ ఉన్నారా? అయినా ఒక్క ఎన్నికలలో ఓడిపోగానే అస్త్ర సన్యాసం చేసి రెండేళ్లుగా ఫామ్హౌసులో ఉండిపోయి ప్రజలకు దూరంగా ఉన్న కేసీఆర్ మరో మూడేళ్ళదాకా బయటకు రాదలచుకొనప్పుడు ఆయనని ప్రజలు ఎందుకు గెలిపించాలి?అనే ధర్మ సందేహం ఎవరికీ కలగదు. ఆయన బయటకు రాదలుచుకోనప్పుడు బలవంతంగా బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయడం దేనికి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ఉండవచ్చు. కానీ కేటీఆర్ నేత్రుత్వంలో హరీష్ రావుతో సహా ఆ పార్టీ నేతలందరూ సర్వశక్తులు ఒడ్డి పోరాడారు కదా?కనుక ఇకపై నేనే పార్టీని నడిపించుకుంటాను… గెలిపించుకుంటాను… ముఖ్యమంత్రిని అవుతానని చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది కదా?
కానీ కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామనడం దేనికి? అందుకోసమే ఈ పోరాటాలైతే మద్యలో ‘ప్రజా సమస్యలు’ దేనికి? ఇలాంటి ధర్మ సందేహాలు అభిమానుల మనోభావాలు దెబ్బ తీస్తాయి. కనుక అన్నీ పక్కన పెట్టి చప్పట్లు కొట్టేద్దాం!







