బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడినప్పటికీ పక్కనే ఉన్న విశాఖపట్నంలో చెదురుమదురుగా వానలు కురుస్తుంటే, సుమారు 700-800 కిమీ దూరంలో ఉన్న తెలంగాణలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న అకాలవర్షాలను, వాటి ఉదృతిని చూస్తున్నప్పుడు వరుణదేవుడు పగబట్టాడా?అని అనిపించకమానదు.
కానీ గమ్మతైన విషయం ఏమిటంటే, ఓ పక్క ఈ భారీ వర్షాలు, వరదలు తెలంగాణను ముంచెత్తుతూ అస్తవ్యస్తం చేస్తూ, అపార నష్టం కలిగిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎప్పటిలాగే నీళ్ళ రాజకీయాలు చేస్తూనే ఉంది.
చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్ళు నింపకుండా ఏపీకి వదిలేస్తున్నారని కేటీఆర్, హరీష్ రావు యుగళగీతం పాడుతూనే ఉన్నారు.
మరోపక్క కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మరో 5 అడుగులు పెంచేసి తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీతో వేగలేక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణనదీ జలాలలో తెలంగాణ వాటాని వదులుకోమని దాని కోసం ఎన్ని పోరాటాలైన చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని, రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఈ భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తుండటం ఒక సమస్య అనుకుంటే, ఇంత నీళ్ళు అందుబాటులో ఉన్న వాడుకోలేకపోతున్నారు. కనీసం నిలువచేసుకోలేకపోతున్నారు. అయినా ఇరుగు పొరుగు రాష్ట్రాలపై ఈ ఏడ్పులు మాత్రం ఆగడం లేదు.
విశ్వనగరమని గొప్పలు చెప్పుకుంటున్న హైదరాబాద్ ఈ భారీ వర్షాలధాటికి నీట మునుగుతోంది. ఏటా ఇంచు మించు ఇదే పరిస్థితి పునరావృతం అవుతోంది.
ఈ నేపధ్యంలో అటు కృష్ణానదికి, ఇటు బుడమేరుకి మద్యలో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిస్థితి ఏమిటి?అనే సందేహం కలుగకమానదు.
అమరావతి పూర్తిగా ప్లాన్డ్ సిటీ. కనుక ఎంత భారీగా వర్షాలు కురిసినా, వరదలు వచ్చినా హైదరాబాద్లా అమరావతి నీట మునగదు… ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు… అని మంత్రి నారాయణ చెప్పి, అమరావతిలో వరద నీటి డ్రయినేజ్ వ్యవస్థ గురించి వివరిస్తే బాగుండేది. కానీ చెప్పకపోవడం వల్లనే హైదరాబాద్లో భారీ వర్షం కురిస్తే అమరావతి మునిగిపోయిందని వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. కనుక ఇప్పటికైనా చెపితే బాగుంటుంది.




