తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం ఉండాలనే కేసీఆర్ కలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. చారిత్రాత్మక విశిష్టత కలిగిన ఎర్రమంజిల్లో అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని కొట్టివేసింది. ఎర్రమంజిల్ భవనాలను, అలాగే ప్రస్తుత అసెంబ్లీ భవనాలను కూల్చివేయద్దని హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై తీర్పునిచ్చింది. ఈ విషయంగా సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు ఫైనల్ గా ఈరోజు తన తుదితీర్పునిచ్చింది.
ఎర్రమంజిల్ నిర్మాత నవాబ్ సప్దర్ జంగ్ ముషీరుద్ దౌలా ఫక్రుల్ ముల్క్ వారసులు నూరి ముజఫర్ హుస్సేన్తో పాటు మరో ఏడుగురు కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 1870లో 150 గదులతో ఎర్రమంజిల్ నిర్మించారని తెలిపారు. ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తారనే ఉద్దేశంతో 1951లో ప్రభుత్వానికి అప్పగించామని, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయాలని మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేయాలని వారసులు కోరారు.
ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి ఏం చెయ్యబోతుందో అని ఆసక్తికరంగా మారింది. ఈ తీర్పుని పై కోర్టులో అప్పీల్ చేస్తుందా లేక ప్రత్యామ్న్యాయ మార్గం ఏదైనా అన్వేషిస్తుందా అనేది చూడాలి. కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియట్ నిర్మించాలనే కల కేసీఆర్ మొదటి టర్మ్ నాటిది. తెలంగాణ చరిత్రపై తనదైన మార్కు ఒకటి ఉండాలి అని అనుకుని కేసీఆర్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విషయం అనుకునప్పుడల్లా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది.



