శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ఉంది. కనుక కేసీఆర్ హయంలోనే వరంగల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు జరిగాయి. కానీ ఫలించలేదు.
ఆయన తర్వాత సిఎం రేవంత్ రెడ్డి కనీసం వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు భూసేకరణ కూడా పూర్తికాలేదు.
కానీ రాష్ట్ర విభజనతో ఒకసారి, జగన్ 5 ఏళ్ళ విధ్వంస పాలనతో మరొకసారి దెబ్బతిన్న ఏపీలో ఇప్పటికే 5 విమానాశ్రయాలు ఉండగా, అమరావతి (అంతర్జాతీయ విమానాశ్రయం)తో సహా కొత్తగా మరో 5 విమానాశ్రయాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది.
ముందుగా విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం మూడు జిల్లాలకు మద్యలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026, జూన్లో ప్రారంభోత్సవం కాబోతోది.
కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతీ నెలా భోగాపురం విమానాశ్రయానికి వెళ్ళి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అవసరమైన సహాయసహకారాలు అందిస్తూ శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు. శనివారం మరోసారి వెళ్ళి పనుల పురోగతిని సమీక్షించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాన టెర్మినల్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఏప్రాన్, రన్వే తదితర పనులు 86% పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్లో ప్రధాని మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తాము,” అని చెప్పారు.
రాష్ట్రమంత్రి అచ్చన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఇద్దరి సొంత జిల్లా శ్రీకాకుళమే. కనుక వారిద్దరూ తమ జిల్లాలో మూలపేట వద్ద పోర్టు, ఎయిర్ పోర్టు నిర్మించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఒక్క విమానాశ్రయం కూడా ఏర్పాటు చేసుకోలేకపోతుంటే, ఆంధ్రప్రదేశ్ ఏకంగా అరడజను విమానాశ్రయాల ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.




