శాసనసభ సమావేశాలు మొదలైనప్పుడల్లా జగన్, కేసీఆర్ వస్తారా రారా? అనే చర్చ పరిపాటిగా మారినట్లే, పెద్ద సినిమాలు విడుదలవుతున్న ప్రతీసారి కూడా టికెట్ ధరలు పెంపు ఉంటుందా ఉండదా?అనే సందిగ్ధత నెలకొంటుంది.
శుక్రవారం రాజాసాబ్, సోమవారం మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. కనుక మళ్ళీ ఇదే డైలమా మొదలైంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉదారంగానే వ్యవహరిస్తోంది కనుక ఏపీలో ఎటువంటి ఇబ్బందీ లేదు.
కానీ తెలంగాణలో తెలుగు సినిమాలకు కనపడని ‘ఆంద్ర ముద్ర’ ఒకటి ఉంది. కనుక అడిగిన వెంటనే అనుమతిస్తే రాజకీయాలు మొదలైపోతాయి. అందువల్ల ప్రతీ పెద్ద సినిమా రిలీజ్ ముందు ఈ డైలమా ఆనవాయితీగా మారింది.
రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారి కోసం టికెట్ ధరలు పెంపు, ప్రత్యేక షోలకు అనుమతివ్వాలని ఆ చిత్ర నిర్మాతలు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.
కానీ గతంలో సింగిల్ జడ్జ్ తీర్పు అవరోధంగా ఉందని చెప్పడంతో నిర్మాతలు హడావుడిగా నిన్న హైకోర్టులో పిటిషన్లు వేశారు.
వాటిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ తీర్పు ఇదివరకు విడుదలైన పుష్ప-2, గేమ్ చేంజర్, ఓజీలకు మాత్రమే పరిమితం చేసింది. కనుక ఇప్పుడు బంతి తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పడింది. ఏం నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది సేపటిలో తెలుస్తుంది.
పుష్ప-2 రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు. “నేను ఈ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మళ్ళీ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలు అనుమతించే ప్రసక్తి లేదని,” సిఎం రేవంత్ రెడ్డి నాడు శాసనసభలో ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. కానీ కొన్ని నెలల తర్వాత మళ్ళీ అనుమతించడం మొదలుపెట్టారు. కనుక ప్రతీసారి ఈ డైలమా స్టోరీ వినిపిస్తూనే ఉంది.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన వైఖరి తీసుకొని అందుకు అనుగుణంగా చట్టం చేసినట్లయితే, ప్రతీసారి ఈ సమస్యపై ఇంత రాద్దాంతం లేదా చర్చ లేకుండా నివారించవచ్చు.
కానీ సినీ పరిశ్రమకి ప్రభుత్వం యొక్క అవసరం ఉంటుందని గుర్తుచేసి, గీత దాటకుండా ఉంచడానికే ఈ డైలమా కొనసాగేలా చేస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






