బెల్ట్ షాపులకు టెండర్…వ్యవస్థలు ఎటుపోయాయి.?

Andhra Pradesh Liquor Policy: 3396 General, 12 Premium Stores

హైటెక్ సీఎం గా, పని రాక్షసుడిగా, అధికారులను పరుగులు పెట్టించే నాయకుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పాలనలో వ్యవస్థలు సరిగా పని చేయడం లేదు అనే అపవాదును మొదటిసారి ఎదుర్కుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

ADVERTISEMENT

సొంత కూటమి నాయకుల నుంచి, ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రుల నుంచి, పార్టీ కింద స్థాయి వ్యక్తుల నుంచి, చివరికి పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఈ విమర్శ కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ, నిలదీస్తూనే ఉంటుంది.

అయినా వ్యవస్థలలో ఎటువంటి చలనం కనిపించడం లేదు. స్వయంగా సీఎం బాబే గత ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది, వీటిలో చలనం తెచ్చే ప్రయత్నం చేస్తున్నా అంటూ పలుమార్లు బహిరంగంగానే అధికారులకు చురకలంటించారు. అయినా వారికీ ఇంకా సెగ తగలేదనే చెప్పాలి.

ఈ విమర్శలకు బలం చేకూరేలా రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు నిత్యం మీడియాలో దర్శనమిస్తూనే వస్తున్నాయి. వ్య్వక్తిగత దూషణలతో వైసీపీ సోషల్ మీడియా సైన్యం తమ వికృత పోస్టులతో రెచ్చిపోతున్నా పట్టనట్టు ఉండిపోతున్నారు . అయితే వారిలో చలనం కలిగించడానికి పవన్ తన నోటికి పనిచెప్పాల్సి వచ్చింది.

కనీసం అప్పుడైనా వారు తమ విధిని సక్రమంగా నిర్వర్తించారా అంటే బోరుగడ్డ లాంటి అరాచక శక్తులకు వంగివంగి పరిచర్యలు చేస్తూ అడ్డంగా మీడియాకు దొరికి వీరు సమాజ రక్షకులా భక్షకులా అనే విమర్శలను మూటకట్టుకున్నారు. ఇక పబ్లిక్ గా మీడియాలో ఇంటర్ వ్యూ లు ఇస్తున్న ఆర్జీవీ ని సైతం పట్టుకోవడానికి ముప్పతిప్పలు పడుతున్నారు.

ఇప్పుడు తాజాగా హోమ్ మంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావు పేటలోని పేటసూదిపురం అనే ప్రాంతంలో బెల్ట్ షాపులకు కొంతమంది గుంపుగా చేరి బహిరంగంగా వేలం పాట నిర్వహిస్తున్నారు. దేవుని పాట 10000 అంటూ మొదలు పెట్టిన ఈ వేలం పాట దాదాపు 2 లక్షలకు ఓ స్థానికుడుకు దక్కించుకున్నాడు.

అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీనితో వీటిని కట్టడి చేయాల్సిన వ్యవస్థలు, ఆ వ్యవస్థలను నడిపే అధికారులు ఏంచేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో బెల్ట్ షాపుల నిర్ములనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కాదని ముందడుగు వేస్తె ఉపేక్షించిదేది లేదని, అటువంటి వారి పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినప్పటికీ ఈ ఆకతాయిల బరితెగింపు, అధికారుల అలసత్వం కొనసాగుతూనే ఉన్నాయి.

అనితకు అవమానాన్ని, కూటమి ప్రభుత్వానికి అపకీర్తిని తెచ్చి పెట్టే ఇటువంటి చర్యల మీద కూడా పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించకపోతే ఇక వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఎలా కలుగుతుంది..? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే వారిని కట్టడి చేయ్యలేకపోతున్నారు, ప్రభుత్వ పెద్దలను హేళన చేస్తూ కించపరిచే వారిని శిక్షించలేకపోతున్నారు, ఇలా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బహిరంగంగా బరితెగిస్తున్న వారి ఆట కట్టించలేకపోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories