పెద్ద సినిమాల పోటీ కేవలం సంక్రాంతి పండగనే లక్ష్యంగా పెట్టుకోవడం లేదు. దీపావళిని మనవాళ్ళు అంత సీరియస్ గా తీసుకోరు కానీ టాలీవుడ్ కు సంబంధించి సెలవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దసరాని కీలకంగా భావిస్తారు. ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతోంది. మూడు ముక్కలాటలో అన్నీ కింగ్ సైజు కార్డులే తలపడబోతున్నాయి.
బాలకృష్ణ – అనిల్ రావిపూడిల క్రేజీ కాంబో భగవంత్ కేసరి మీద అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలున్నాయి. వయసు దాచకుండా తెల్లని గెడ్డంతో టీజర్ కనిపించిన ఊర మాస్ బాలయ్యని చూసి హైప్ అమాంతం పెరిగింది. ఇప్పటిదాకా ఫ్లాపే లేని ట్రాక్ రికార్డున్న రావిపూడి భగవంత్ కేసరిని ఏ రేంజ్ లో చూపిస్తాడోనని ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
బిజినెస్ కూడా క్రేజీగానే ఉండబోతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు పీరియాడిక్ సెటప్ తో ఇప్పటిదాకా రాని స్టువర్ట్ పురం దొంగ బయోపిక్ తో వస్తోంది. బ్యాక్ డ్రాప్ తో పాటు దశాబ్దాల నాటి విజువల్స్ ని దర్శకుడు వంశీ కనక మంచి స్క్రీన్ ప్లేతో చూపించగలిగితే ప్యాన్ ఇండియా స్థాయిలో హిట్టు కొట్టొచ్చు.
ఇక పేరుకి డబ్బింగ్ చిత్రమే అయినా విజయ్ లియో మీదున్న క్రేజ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. తెలుగు రాష్ట్రాలకు సంబందించిన హక్కులను పాతిక కోట్ల దాకా అడుగుతున్నారనే వార్త ట్రేడ్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా విజయ్ మార్కెట్ టాలీవుడ్ లో బాగా పెరిగింది.
కథలు ఎంత రొటీన్ గా ఉన్నా వాటిలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ మన మాస్ జనాలకు నచ్చేసి హిట్లు పడుతున్నాయి. తుపాకి నుంచి ఇది ఊపందుకుంది. వారసుడు ఫ్లాపయినా రికవరీ బాగానే జరిగింది. లియోకి లోకేష్ కనగరాజ్, అనిరుద్ రవిచందర్ లు తోడవ్వడం యూత్ లో హైప్ ని పెంచేసింది. నిజానికి బోయపాటి రాపో సినిమా కూడా దసరానే కోరుకుంది. అయితే కాంపిటీషన్ చూసి చాలా తెలివిగా సెప్టెంబర్ 15కు వెళ్ళిపోయి మంచి పని చేసింది.
ఈ నేపథ్యంలో త్రిముఖ పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది. ముగ్గురూ సీనియర్ స్టార్లే. అందరూ హిట్ ట్రాక్ లోనే ఉన్నారు. అఖండ-వీరసింహారెడ్డిలతో బాలయ్య, ధమాకా – వాల్తేరు వీరయ్యలతో రవితేజ, బీస్ట్-వారసుడులతో విజయ్ ఇలా ముగ్గురూ మంచి ఫామ్ లోనే తలపడుతున్నారు. చివరికి మాట్లాడాల్సింది కంటెంటే అయినా ఓపెనింగ్స్ తో మొదలుపెట్టి ఫైనల్ రన్ దాకా ట్రయాంగిల్ వార్ మాత్రం మూవీ లవర్స్ కి పండగే





