ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత ఓ మూడ్రోజులు వైసీపి నేతలందరూ ‘సామూహిక ఆక్రోశ కార్యక్రమం’ నిర్వహించిన తర్వాత మళ్ళీ ‘జగన్ అనే నేను…’ అంటూ సోషల్ మీడియాలో ఒకటే ఊదరగొట్టారు.
జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు విశాఖలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చేత కూడా చెప్పించారు.
ఆ జూన్ 9వ తేదీ నేడే. కానీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకున్న జగన్, ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎవరికీ మొహం చూపించలేక తాడేపల్లి ప్యాలస్లో నుంచి అడుగు బయటకు పెట్టలేకపోతున్నారు.
కానీ ఆరోజు సోషల్ మీడియాలో పెట్టుకున్న ‘జగన్ అనే నేను’ పోస్టర్స్ ఇప్పుడు జగన్ని, వైసీపి నేతలను వెక్కిరిస్తూనే ఉన్నాయి.
నిజానికి టిడిపి, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడినప్పుడే ఈసారి ఎన్నికలలో ఓటమి తప్పదని జగన్తో సహా వైసీపిలో అందరూ గ్రహించారు. పోలింగ్ తర్వాత వారి ఏడుపు మొహాలు చూసిన ప్రజలు కూడా వారు ఓడిపోతున్నారని గ్రహించారు.
ఎన్నికలలో ఓడిపోబోతున్నామని తెలిసీ కూడా ఇలా ఎవరైనా ప్రమాణ స్వీకారం అంటూ అబద్దాలు చెప్పుకుంటారా?చెప్పుకుంటే మనమే నవ్వులపాలవుతామని వైసీపి నేతలు ఎవరూ గ్రహించలేదా?అనే సందేహం కలుగుతుంది.
కానీ ఈ 5 ఏళ్ళు ప్రజలను, పార్టీ నేతలను మభ్యపెడుతూనే దొర్లించేశాము కనుక చివరిసారిగా మరో అబద్దం చెపితే కొత్తగా పోయే పరువు ఏముంటుందని జగన్ అనుకుని ఉండవచ్చు. లేదా కనీసం చివరి నాలుగు రోజులైనా మరో అబద్దంతో అల్పసంతోషం పొందవచ్చు కదా అనే ఆలోచనతో కావచ్చు.
లేదా వైసీపిని ఓడించడానికి కంకణం కట్టుకొని జగన్కు శల్యసారధ్యం చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి తాను తీసుకుంటున్న జీతానికి పరిపూర్ణంగా న్యాయం చేయాలని ఈ సలహా ఇచ్చి ఉండవచ్చు.
లేదా ఈ ఎన్నికలలో వైసీపియే గెలువబోతోందని నమ్మిస్తూ వచ్చిన ఆరా మస్తాన్, ఐప్యాక్ టీమ్ జగన్ని మరోసారి నమ్మిస్తే నష్టం ఏమిటని అనుకుని ఉండవచ్చు.
అందరూ నువ్వే ముఖ్యమంత్రివి అని చెపుతుంటే వినడానికి చెవులకు ఇంపుగానే ఉంటుంది కనుక జగన్ కూడా నమ్మి ఉండవచ్చు.
ఏది ఏమైనప్పటికీ నూటికి నూరు శాతం ఓటమి సరిపోదన్నట్లు నూటికి నూరుశాతం పరువు కూడా తీసుకుని నవ్వుల పాలయ్యారు జగన్, వైసీపి నేతలు.
కనుక జగన్ ప్రమాణ స్వీకారం చేయకపోయినా, 175కి బదులు 11 సీట్లు గెలుచుకున్నందుకు జూన్ 9వ తేదీ ఉదయం 9.38 గంటలకు వైసీపిలో అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున అభినందనలు తెలియజేయక తప్పదు.




