టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ పెను ప్రకంపనలనే రేపుతోంది. పట్టుబడిన కెల్విన్ ముఠా వెల్లడించిన డ్రగ్ వినియోగదారుల జాబితాతో పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఇందులో భారీ ఎత్తున టాలీవుడ్ లింకులు బట్టబయలు కావడం, డ్రగ్స్ తీసుకునే సినీ నటులందరికీ గచ్చిబౌలిలోని ఒక పబ్ అడ్డా అని అధికారులు గుర్తించారు. ఇటీవల టాలీవుడ్ లో మృతి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ మరియు మరో నటుడికి నిత్యం తానే డ్రగ్స్ సరఫరా చేశానని కెల్విన్ తెలిపాడు.
వర్ధమాన గాయని భర్త డ్రగ్స్ తీసుకుంటాడని, బాల నటుడిగా చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి నటుడిగా మారి అవకాశాల్లేని నటుడికి కూడా డ్రగ్స్ తో సంబంధం ఉందని కెల్విన్ చెప్పాడు మరో ముగ్గురు యువ నటులు, ముగ్గురు స్టార్ నటులు, ముగ్గురు హీరోయిన్లు, ఒక స్టార్ దర్శకుడు ఇలా చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేశానని కెల్విన్ వివరించినట్టు సమాచారం. దీంతో ఈ నెల 19 నుంచి 27 తేదీ వరకు సినీ పరిశ్రమకు చెందిన స్టార్లను విచారణ చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.
అయితే సినీ ప్రముఖులను సిట్ ఆఫీసులో నేరుగా విచారించే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. సినీ ప్రముఖుల ఇమేజ్ కు భంగం వాటిల్లకుండా వారిని రహస్య ప్రదేశంలో విచారించనున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణకు సంబంధించిన సమాచారం విచారణ రోజు ఉదయం వారికి ఫోన్ ద్వారా చెబుతారని, వారు అక్కడికి చేరుకోవాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి అసిస్టెంట్లను మాత్రం సిట్ కార్యాలయంలోనే విచారించనున్నారని తెలుస్తోంది.



