అభిమానులను దోచుకుంటూ న్యాయం కావాలా?

tollywood-meeting-with-revanth-reddy

తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలు పరిష్కరించాలని, ప్రివిలేజ్ షోలు, బెనిఫిట్ షోలు వేసుకునేందుకు, టికెట్స్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరే ముందు, సినీ పరిశ్రమ ముందుగా ఆత్మవిమర్శ చేసుకొని ఉండాలి.

సినిమా విడుదలకు సిద్దమైనప్పుడు సినీ పరిశ్రమ ప్రమోషన్స్ మొదలుపెట్టి, అభిమానుల వల్లనే మేము ఈ స్థాయికి ఎదిగామని, మీకెప్పటికీ ఋణపడి ఉంటామని ప్రతీ హీరో చిలక పలుకులు పలుకుతుంటాడు.

ADVERTISEMENT

కనుక తమని ఆ స్థాయికి చేర్చిన అభిమానుల రుణం తీర్చుకోవాలనుకుంటే వారి కోసం 50 లేదా 75 శాతం రాయితీ తో ప్రివిలేజ్ షోలు వేయవచ్చు.

కానీ వారి నుంచే టికెట్ మీద అదనంగా రూ.800 చొప్పున ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటున్నారు కదా? ఏమంటే టికెట్స్ బ్లాక్ మార్కెట్‌లోకి వెళ్ళకుండా ఉండేందుకు అని నిసిగ్గుగా సమర్ధించుకుంటున్నారు.

ఆ వెర్రి అభిమానంతో భాస్కర్, రేవతి దంపతులు తమ తాహతుకి మించిందే అయినా రూ.4-5,000 పెట్టి టికెట్స్ కొనుక్కొని సినిమా చూడబోతే రేవతి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆమె 13 ఏళ్ళ కొడుకు శ్రీతేజ్ నేటికీ ఆస్పత్రిలో ఉన్నాడు.

టికెట్ రేట్స్ పెంచకపోతే నష్టపోతామని వాదించేవారు ఇప్పుడు రేవతి కుటుంబానికి రెండు కోట్లు ఇచ్చేందుకు ఎందుకు సిద్దపడుతున్నారో అందరికీ తెలుసు.

సరే.. వందల కోట్లు పెట్టి సినిమాలు తీశారు కనుక టికెట్స్ రేట్స్ పెంచుకుంటారని సర్ధిచెప్పుకున్నా, అభిమానులతో, చివరికి పోలీస్ అధికారులతో బౌన్సర్లు వ్యవహరిస్తున్న తీరుని టాలీవుడ్‌ సమర్ధించుకోగలదా?

అభిమానులతో ఇంత అన్యాయంగా వ్యవహరిస్తూ తమకు న్యాయం చేయాలని సినీ ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరడం చాలా విడ్డూరంగా ఉంది కదా?

సినీ పెద్దల దృష్టిలో సినీ పరిశ్రమ అంటే పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, పెద్ద దర్శకులు.. వందల కోట్లు పెట్టి వారు తీసే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తప్ప చిన్న హీరోలు, నిర్మాతలు, దర్శకులు వారి సినిమాలు కానేకాదు.

అప్పటికీ ఈ ధోరణి సరికాదని చిన్న నిర్మాతలు, దర్శకులు చెపుతూనే ఉంటారు. కానీ వారిని పట్టించుకోవలసిన అవసరమే లేదు సినీ పెద్దలకు.

ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతోందంటే చిన్న సినిమాలన్నీ వాయిదా వేసుకోవలసిందే. ఒకవేళ రిలీజ్ చేసుకుందామనుకున్నా వాటికి థియేటర్లు దొరకవు. అన్నీ పెద్దలే కబ్జా చేసేస్తారు.

ఇక సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ సిబ్బందికైనా న్యాయం చేస్తున్నారా?అంటే లేదని ప్రతీ రెండు మూడేళ్ళకు ఓసారి జరిగే సమ్మెలే చెపుతున్నాయి.

సినిమా షూటింగ్‌లు నిలిచిపోతే వారి, వారి కుటుంబాల కష్ట నష్టాలను, ఆకలి బాధలను సినీ పెద్దలు పట్టించుకున్నారా?అంటే అదీ లేదు.. ఏకధాటిగా నెలరోజులు సినిమా షూటింగ్‌లు నిలిపివేయడం అందరికీ తెలుసు.

కనుక సినీ పరిశ్రమలో అంతర్భాగంగా ఉన్నవారినే సినీ పెద్దలు పట్టించుకోనప్పుడు, తెలిసో తెలియకో సినీ పరిశ్రమలో అల్పజీవులను కోలుకోలేని విదంగా దెబ్బ తీస్తున్నప్పుడు, టాలీవుడ్‌ని, సినీ ప్రముఖులని ప్రభుత్వం మాత్రం ఎందుకు పట్టించుకోవాలి?

కనుక తెలుగు సినీ పరిశ్రమని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళకపోయినా పరవాలేదు కానీ ముందు తమ కాళ్ళ కింద నలిగిపోతున్న అల్పజీవుల పట్ల కాస్త కనికరం చూపిస్తే చాలు.

ADVERTISEMENT
Latest Stories