తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖుల ధోరణి వలన టాలీవుడ్ పరిస్థితి రెంటికీ చెడిన రేవాడిగా మారింది. పుష్ప-2-అల్లు అర్జున్-సంధ్య థియేటర్ వ్యవహారంలో సినీ ప్రముఖులు వ్యవహరించిన తీరు పట్ల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేసి, టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు ఇకపై అనుమతించబోమని చెప్పేశారు.
అయితే ఆయన ఆగ్రహానికి అదొక్కటే కారణం కాదు.
తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయనతో, బిఆర్ఎస్ మంత్రులతో అంటకాగిన సినీ ప్రముఖులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసేందుకు ఆసక్తి చూపలేదు.
అప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వారి తీరుని తప్పు పడుతూ విమర్శించిన తర్వాత హడావుడిగా వచ్చి కలిశారు. ఆ తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినప్పుడు, సినీ ప్రముఖులు పట్టించుకోలేదు. అప్పుడు మళ్ళీ ఆయనే ఘాటుగా విమర్శించిన తర్వాత హడావుడిగా ఓకే చెప్పారు.
తెలుగు సినీ ప్రముఖుల ధోరణి ఈవిదంగా ఉన్నందునే, తెలంగాణలో సాఫీగా సాగిపోతున్న టాలీవుడ్కి ప్రభుత్వం చేయూత కరువైంది.
అల్లు అర్జున్-సంధ్య థియేటర్ పరిణామాల తర్వాత, తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏపీలో జరుపుకోవడం మొదలుపెట్టారు.
వారికి సిఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి మంత్రి కందుల దుర్గేష్ ముగ్గురూ సాదరంగా స్వాగతం పలికి అన్ని విధాలా సహకరించారు. టాలీవుడ్ ఆంధ్రాకు విస్తరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కానీ ‘జగన్ ఫోబియా’ కారణంగా వారు ఆంధ్రాకు విస్తరించడానికి ఆసక్తి చూపలేదు. వారి భయాలను అర్ధం చేసుకోవచ్చు.
కానీ వారు తెలంగాణలో చేసిన తప్పునే ఏపీలో కూడా చేస్తున్నారని సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొట్టారు.
ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఇంతవరకు సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలవకపోవడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ ప్రముఖులని ఎంతగా అవమానించారో, చీత్కరించుకున్నారో మరిచిపోయారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం అవన్నీ పట్టించుకోకుండా వారికి అన్నివిదాల సహకరిస్తుంటే అలుసుగా భావిస్తున్నారా?ఇకపై వినతి పత్రాలు పట్టుకొని తన వద్దకు ఎవరూ రావద్దని పవన్ కళ్యాణ్ చెప్పారు.
తెలంగాణలో పరిస్థితి బాగోనప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ తమని ఎంతగానో ఆదరించారనే విషయం కూడా తెలుగు సినీ ప్రముఖులకు గుర్తులేదంటే ఏమనుకోవాలి?
సినీ పరిశ్రమలో అందరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఏదైనా కష్టం వస్తే అందరూ పరుగున ముఖ్యమంత్రి దగ్గరకు వస్తుంటారు కదా?అప్పుడు తీరిక చేసుకొని రాగలిగినప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఎందుకు రాలేదు?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ‘గద్దర్ అవార్డ్స్’ ఇస్తామంటే పట్టించుకోనట్లే, టాలీవుడ్ని ఏపీకి విస్తరించాల్సిందిగా ఏపీ సిఎం, డెప్యూటీ సిఎం, సినిమాటోగ్రఫీ మంత్రి ముగ్గురూ స్వయంగా ఆహ్వానించి, వారు స్టూడియోలు వగైరా నిర్మించుకోవడానికి భూములు, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పినా కనీసం స్పందించలేదు.. ఎందుకు?
తెలంగాణ ప్రభుత్వంతో చెడగొట్టుకొని ఎలాగూ నష్టపోతున్నారు. ఎదురుదెబ్బలు తింటున్నారు. అయినా సినీ ప్రముఖుల ధోరణి మారలేదు.
ఇంతగా ఆదరిస్తున్న ఆంధ్రాలో కూడా చేజేతులా చెడగొట్టుకొంటున్నారు. ‘ప్రభుత్వంలో మనవాడే ఉన్నాడు కదా’ అని నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆ మనవాడే చురకలు వేశారు కదా?
టాలీవుడ్లో ఓ నలుగురైదుగురి నిర్లక్ష్య ధోరణికి టాలీవుడ్లో అందరూ నష్టపోవాలా?ఆలోచించుకుంటే మంచిది.




