స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయడమే పర్యాటకమా?

Minister-Roja-Selvamaniఎన్టీఆర్‌ జిల్లా గుణదలలో కొత్తగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్‌ను సిఎం జగన్‌ శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలనే ఆలోచనతో పర్యాటక పాలసీని ప్రవేశపెట్టి మంచి బ్రాండ్ ఇమేజ్‌ ఉన్న ఒబెరాయ్ మొదలు నేడు ఈ హయాత్ హోటల్‌ వరకు అనేక స్టార్ హోటల్స్‌ని ప్రోత్సహిస్తున్నాము.

ADVERTISEMENT

ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఇటువంటి స్టార్ హోటల్స్ రావలసి ఉంది. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిదాల సహాయసహకారాలు అందించడానికి సిద్దంగా ఉంది” అని సిఎం జగన్‌ అన్నారు.

ఏపీలో అటు చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. కానీ ఈ నాలుగేళ్ళలో వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పట్టించుకొన్న దాఖలాలు లేవు.

మంత్రి పదవి కోసం ఎంతగానో ఆరాటపడిన రోజా, కీలకమైన పర్యాటకశాఖ లభిస్తే రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమీ చేయకుండా నెలకు రెండుసార్లు తిరుమలకు, నాలుగుసార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్ళివస్తూ జగన్‌ భజన చేస్తూ, ప్రతిపక్ష నేతలను అవహేళన చేస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.

అయినా ప్రభుత్వంలో కీలకమైన హోమ్, ఆర్ధిక, రెవెన్యూ, రోడ్లు భవనాలు, జలవనరులు, వైద్య, విద్యుత్ శాఖల పరిస్థితే అంతంత మాత్రంగా ఉన్నప్పుడు, ఇక పర్యాటకశాఖను పట్టించుకొంటుందా?

ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్న వైసీపీ ప్రభుత్వం పర్యాటకరంగానికి నిధులు కేటాయించగలదా?

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయకుండానే ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని కోరుకోవడం అత్యాశే కదా?అయినా నాలుగు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేసి అదే పర్యాటక అభివృద్ధి అన్నట్లు సిఎం జగన్‌ మాట్లాడటం విడ్డూరంగా ఉంది కదా?

తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తోందో మన పర్యాటక మంత్రి రోజాకు తెలియదనుకోలేము. ఒకప్పుడు తెలంగాణ అంటే హైదరాబాద్‌… హైదరాబాద్‌ అంటే గోల్కొండ, ఛార్మినార్ అన్నట్లు ఉండేవి. కానీ నేడు హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలలో మారుమూల ప్రాంతాలలోని పర్యాటక ఆకర్షణ కేంద్రాలను ఎంతగానో అభివృద్ధి చేయడంతో దేశవిదేశాల నుంచి లక్షలాది పర్యాటకులు తెలంగాణకు వస్తున్నారు.

తద్వారా పర్యాటక రంగం కూడా తెలంగాణ రాష్ట్రానికి బంగారు బాతులా మారి భారీగా ఆదాయం సమకూర్చుతోంది. కానీ ఏపీలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉండటంతో పర్యాటకరంగం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మిగిలిపోయింది. దీనికి ఎవరిని నిందించాలి?పాలకులనా అంటువంటి వారిని ఎన్నుకొన్న ప్రజలనా?

ADVERTISEMENT
Latest Stories