ఏడు యుద్ధాలు ఆపిన ఘనుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్! కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆపలేకపోతున్నాని చేతులెత్తేశారు. దీంతో అయన పెద్దరికానికి విలువ లేకుండా పోయింది.
పైగా ఈ సాకుతో పన్నులు పెంచేస్తూ మిత్ర దేశమైన భారత్ని రష్యాకు మరింత దగ్గరయ్యేలా చేశారు. ముఖ్యంగా భారత్, రష్యా, చైనాలు కూటమిగా ఏర్పడేలా చేశారు. దీనిని ట్రంప్ విదేశీ విధానంలో వైఫల్యంగానే చూడాల్సి ఉంటుంది.
జో బైడేన్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ప్రయత్నించకుండా ఉక్రెయిన్కు ఆయుధాలు అందించడాన్ని ట్రంప్ తప్పు పట్టారు. అధ్యక్ష పదవి చేపట్టగానే ఆయుధాల సరఫరా నిలిపివేశారు.
కానీ ఇప్పుడు ఉక్రెయిన్కు అత్యాధునిక క్షిపణులు, ఆయుధాలు అందించి సాయపడాలని డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు! ఇది ఆయన అయోమయ స్థితికి నిదర్శనమనుకోవచ్చు లేదా నాటో దేశాలు సమకూరుస్తున్న డాలర్లతో అమెరికా ఆయుధాలని ఉక్రెయిన్కి అమ్ముకుంటున్న తెలివైన బిజినెస్ మ్యాన్ అనుకోవచ్చు.
సుమారు 250-450 కిమీ దూరంలోని లక్ష్యాలను చేదించగల 3,350 అత్యాధునిక క్షిపణులను ఆరు వారాలలోగా ఉక్రెయిన్కు అందించబోతున్నారు.
భారత్ కొనుగోలు చేస్తున్న చమురుతో రష్యాకి ఆర్ధికంగా సాయం లభిస్తోందని కనుక ఆ డబ్బుతో అది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోందని, వేలాది మందిని చంపేస్తోందని ట్రంప్ వాదిస్తున్నారు. కనుక రష్యాకు తోడ్పడుతున్నందుకు భారత్పై పన్నులు పెంచి, జరిమానాలు విధిస్తున్నామని ట్రంప్ చెప్పుకున్నారు.
మరి ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదేమిటి?ఉక్రెయిన్కి ఆయుధాలు అందించి ఈ యుద్ధం మరింత కాలం కొనసాగడానికి ట్రంప్ సాయపడుతున్నారిప్పుడు. కనుక ప్రపంచ దేశాలు అమెరికాపై ఎంత పన్ను, జరిమానా విధించాలి?




