ప్రపంచ మహమ్మారిగా మొత్తం ప్రపంచాన్నే తన ఆధీనంలోకి తీసుకుని అందరిని హౌస్ అరెస్టు చేసిన కరోనా కన్నా పెద్ద వైరస్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్ లా రూపంలో ప్రపంచం ముందుకొచ్చి భయపెడుతుంది, బెదిరిస్తోంది.
అంతా నా ఇష్టం, అంతా నా సొంతం, అంతా నా కనుసన్నల్లోనే నడవాలి, అందరు నా ఆదేశాల మేరకే ప్రపంచంలో వ్యాపారం చెయ్యాలి అనేవి ఈ ట్రంప్ టారిఫ్ వైరస్ లక్షణాలు. అయితే కొవాక్సీన్, కోవిషిల్డ్ అనే రెండు వాక్సిన్ లు కోవిడ్ – 19 ని కొంతవరకు కట్టడి చెయ్యగలిగాయి.
కానీ ఈ ట్రంప్ టారిఫ్ వైరస్ కి వాక్సిన్ అంటే ఆయన ఆదేశాలకు లొంగిపోవడం, ఆయనకు నచ్చినట్టు మారిపోవడమే దారిలా కనిపిస్తుంది. ప్రపంచాన్ని గడగడ లాడించిన కోవిద్ వంటి మహమ్మారిని సైతం తట్టుకుని బలంగా నిలబడగలిగిన భారతీయ దేశీయ మార్కెట్లు ఈ ట్రంప్ టారిఫ్ ల వైరస్ కి తలొగ్గుతున్నాయి.
గత కొంతకాలంగా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలలో ట్రేడ్ అవుతూ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. పూటకో ప్రకటన, రోజుకో చర్య వంటి అర్ధం పర్ధం లేని చేష్టలతో అగ్రరాజ్యధ్యక్షుడు చేస్తున్న రచ్చ తో భారతీయ స్టాక్ మార్కెట్లు కోలుకోని విధంగా దెబ్బతింటున్నాయి.
ముఖ్యంగా రష్యాతో చమురు కొనుగోలు విషయంలో ట్రంప్ భారత్ పై విధిస్తున్న ఆంక్షలు, భారత ప్రధాని నరేంద్ర మోడీ తనను సంతోష పెట్టడం లేదు, పెట్టాల్సిందే, లేకుంటే భారత్ పై మరింత టారిఫ్ ల భారం తప్పదు అంటూ చేస్తున్న చౌకబారు ప్రకటనలు ఫారెన్ ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి.
నేటికీ దేశీయ మార్కెట్లను ఆ భయం నష్టాల రూపంలో వెంటాడుతూనే వస్తుంది. నేడు భారత్ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసాయి. ఇవాళ మార్కెట్ ముగిసే సరికి నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 25,876 వద్ద ట్రేడ్ అవుతుంది, అలాగే బ్యాంకు నిఫ్టీ 304 పాయింట్లు పడిపోయి 59,686 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ సైతం 780 పాయింట్లు పతనమై 84,180 వద్ద క్లోజ్ అయ్యింది. అయితే ఈ భారీ నష్టాల వెనుక ట్రంప్ టారిఫ్ ల వైరస్ యే ముఖ్య కారణం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ టారిఫ్ వైరస్ ఒక్క ఇండియన్ మార్కెట్లే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తూనే ఉంది. మరి ఈ వైరస్ కి వ్యాక్సిన్.?







