అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత రెండు మూడు నెలలుగా భారత్ని ముప్పతిప్పలు పెట్టారు. ప్రధాని మోడీని, భారత్ విధానాలను, ముఖ్యంగా భారత్ ఆర్ధిక వ్యవస్థని అయన అనరాని మాటలన్నారు. భారత్ తీరు మారకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని బెదిరించారు కూడా.
కానీ ఇప్పుడు మాట మార్చి ఇరుదేశాల మద్య భేదాభిప్రాయాలు పెద్ద సమస్య కాదన్నారు. ప్రధాని మోడీ నా మిత్రుడంటున్నారు. ఆయనతో భేటీ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు.
ట్రంప్ విశ్వరూపం చూసి చాలా దేశాలు భయపడ్డాయి. భారత్ ఎగుమతులు నిలిచిపోతాయి కనుక ప్రధాని మోడీ కూడా భయపడతారని ట్రంప్ అనుకున్నారు. కానీ ప్రధాని మోడీ చాలా మొండివారని, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడరనే విషయం ట్రంప్కు బాగా తెలిసి ఉన్నా మరిచిపోయారు.
ట్రంప్కు పాత విషయాలు జ్ఞాపకం లేకపోవచ్చు కానీ భారత్-పాక్ యుద్ధం తానే ఆపానని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా? ‘ఆపరేషన్ సింధూర్’తో పాక్కి ఏవిదంగా బుద్ధి చెప్పారో కళ్ళారా చూశారు కదా?అప్పుడే అవన్నీ మరిచిపోయారా? అంటే కాదనే చెప్పవచ్చు. ట్రంప్ కేవలం అహంభావంతోనే ప్రధాని మోడీని తక్కువ అంచనా వేసి సుంకాలు పెంచి భారత్ని లొంగదీసుకోవాలనుకున్నారు. కానీ కుదరలేదు.
ప్రపంచ దేశాధినేతలు అందరూ ట్రంప్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తుంటే, ఆయన ప్రధాని మోడీతో భేటీ (అపాయింట్మెంట్) కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొని తన స్థాయిని మరింత తగ్గించుకున్నారు కూడా.
సాధారణ పరిస్థితులలో ఈవిదంగా చెప్పడం దౌత్యభాష అవుతుంది. కానీ భారత్ని బెదిరించి భయపెట్టి లొంగదీసుకోవాలని విఫలయత్నాలు చేసిన తర్వాత మోడీతో భేటీకి ఎదురుచూస్తున్నానని ట్రంప్ అనడం తన స్థాయిని తగ్గించుకోవడమే. మోడీని కాళ్ళ బేరానికి తెచ్చుకుందామనుకున్న ట్రంప్ స్వయంగా ప్రధాని మోడీతో కాళ్ళ బేరానికి వచ్చినట్లయింది. ఈ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ స్థాయి మరింత పెరిగింది కూడా.
ఏది ఏమైనప్పటికీ, ట్రంప్ సుంకాలు తగ్గించి భారత్తో మళ్ళీ వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకుంటే ఇరుదేశాలకు మేలు కలుగుతుంది.





