
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు వివిద డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చాయి. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఈ నెల 7నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆర్టీసీ సమ్మె నోటీస్ ఇవ్వడంపై స్పందిస్తూ, “మా ప్రభుత్వానికి మీతో చర్చలు జరపడానికి ఎటువంటి బేషజాలు లేవు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీతో చర్చలు జరిపి, మీ సమస్యలలో కొన్నిటిని పరిష్కరించేందుకు సిద్దంగానే ఉన్నారు. కనుక ఆర్టీసీ ఉద్యోగులు కూడా పంతాలు, పట్టింపులకి పోకుండా చర్చల ద్వారా మీ సమస్యలని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
Also Read – బుల్ జోరు…సీజ్ ఫెయిర్ ఎఫెక్ట్..?
గతంలో మీరు సమ్మె చేసినప్పుడు 50 మంది ఉద్యోగులు చనిపోయినా కేసీఆర్ కరుణించలేదు. అటువంటి వ్యక్తుల మాటలు నమ్మి సమ్మె చేయవద్దు. చెప్పుడు మాటలు విని సమ్మె చేస్తే ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న ఆర్టీసీ మళ్ళీ నష్టాల ఊబిలో కూరుకుపోతుంది. దాని వలన మీకూ, ఆర్టీసీకి కూడా చాలా నష్టం.
గత ప్రభుత్వం విచ్చల విడిగా చేసిన అప్పుల వలన ప్రభుత్వ ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని దానితో సర్దుకుపోవడం చాలా కష్టమవుతోందని ముందే చెప్పాను. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను మీ ముందుంచుతాము. దానిలో ఏ పధకానికి నిధులు ఆపేయాలో దేనికి ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read – ‘పాకీ’స్తాన్ బుద్దులు…!
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె సాగింది. అవసరమైతే ఆర్టీసీని మూసేస్తానే తప్ప ఉద్యోగుల డిమాండ్స్ కు తలొగ్గనని కేసీఆర్ తెగేసి చెప్పారు.
55 రోజుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకున్నారు. ఆ కారణంగా సుమారు 50 మంది ఉద్యోగులు గుండెపోటుతో లేదా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. అయినా కేసీఆర్ కరుణించలేదు.
Also Read – మురళీ నాయక్కు ఏపీ మంత్రులు ఘన నివాళులు
చివరికి ఆర్టీసీ ఉద్యోగులే గత్యంతరం లేని పరిస్థితిలో బేషరతుగా సమ్మె విరమిస్తే, కేసీఆర్ వారిని తన ప్రగతి భవన్కు పిలిపించుకొని బిర్యానీ పెట్టి జేజేలు పలికించుకున్నాక వారి జీతాలు పెంచారు. కేసీఆర్ అదే పని ముందే చేసి ఉండొచ్చు. కానీ ఆర్టీసీ ఉద్యోగులను మానసికంగా, ఆర్ధికంగా, సామాజికంగా కేసీఆర్ చావుదెబ్బ లొంగదీసుకున్నారు. ఆ తర్వాత వారిచేతే తన చిత్ర పటాలకు పాలాభిషేకాలు చేయించుకున్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు మళ్ళీ ఎన్నడూ సమ్మె చేయకుండా కార్మిక సంఘాలను రద్దు చేసి, వాటి నాయకులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ ఎన్నడూ వారు కలలో కూడా సమ్మె ఆలోచన చెయ్యలేదు.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వారి పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో వారి డిమాండ్స్ అంగీకరించడం లేదు. కనుక వారు ఈ నెల 7 నుంచి సమ్మెకు సిద్దం అవుతున్నారు.
ఒకవేళ ఆయన ఆర్టీసీ ఉద్యోగులను ఒప్పించినా లేదా వారి డిమాండ్స్ నెరవేర్చి సమ్మె చేయకుండా ఆపగలిగినా సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ అప్పుడు వీరిని చూసి మరో ఉద్యోగులు సమ్మె ప్రారంభించే ప్రమాదం పొంచి ఉంటుంది.
ఒకవేళ ఆర్టీసీ సమ్మెకు దిగితే ఇప్పటికే అనేక సమస్యలలో సతమతమవుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇదో కొత్త సమస్యగా మారి దీని నుంచి మరిన్ని సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది.
కనుక ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే సిఎం రేవంత్ రెడ్డి ఏవిదంగా ఈ సమస్యని డీల్ చేస్తారనేది చాలా ఆసక్తి కలిగిస్తుంది.